source: X
ఇరాన్తో జరుగుతున్న సైనిక ఘర్షణ అమెరికాకు పెద్ద విషయం కాదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీనిని యుద్ధం అని పిలవడం కంటే 'సైనిక ఘర్షణ' అని చెప్పడమే సరైందని వ్యాఖ్యానించారు. ఇరాన్పై అమెరికా అడపాదడపా దాడులు చేస్తోందని, ప్రస్తుతం తమ దేశం నేరుగా యుద్ధంలో లేదని చెప్పారు.
వైట్హౌస్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'చాలామంది దీనిని యుద్ధం అని పిలవడం లేదు. నేను సైనిక ఘర్షణ అంటాను. ఎందుకంటే ఇది మాకు పెద్ద విషయం కాదు' అని ట్రంప్ పేర్కొన్నారు.
'ఇరాన్ అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకున్నాం'
ఇరాన్పై అమెరికా సాధించిన విజయాలను ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. తమ చర్యలతో ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకున్నామని అన్నారు. హర్మూజ్ జలసంధిపై అమెరికాకు గణనీయమైన నియంత్రణ ఉందని కూడా పేర్కొన్నారు.
మధ్యంతర ఎన్నికల వేళ యుద్ధంపై చర్చ
అమెరికాలో నవంబర్లో కీలక మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ ఘర్షణపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం అమెరికా ప్రజలపై ఆర్థిక భారం పెంచుతోంది.
ఇంధన ధరల పెరుగుదల వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లకు నష్టం కలిగించే అవకాశం ఉందన్న ఆందోళనల మధ్య.. ఇరాన్తో జరుగుతున్న ఘర్షణ తీవ్రతను తగ్గించి చూపేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో హర్మూజ్ జలసంధి భద్రత, అంతర్జాతీయ నౌకాయానం, చమురు సరఫరాలపై ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి.
చదవండి: పాకిస్తాన్కు వెళ్తున్న రష్యా నౌకపై డ్రోన్ దాడి.. అందులో23 మంది భారతీయులు


