source: X
నైజీరియాలో ముడి చమురు దొంగతనానికి యత్నించిన ఘటనలో విషవాయువులు పీల్చుకుని కనీసం 37 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి రివర్స్ స్టేట్లోని ఓక్రికా ప్రాంతంలోని ఓకారి జెట్టీ వద్ద ఈ ఘటన జరిగినట్లు ఆ దేశ యూత్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ వెల్లడించింది.
ఓ నౌకలో పెట్రోలియం ఉత్పత్తులను లోడ్ చేస్తున్న సమయంలో కొందరు అనుమానిత చమురు దొంగలు పైప్లైన్కు అక్రమంగా కనెక్షన్ ఏర్పాటు చేసి, చమురును తమ పడవల్లోకి మళ్లించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది.
ఈ క్రమంలో వెలువడిన విషపూరిత వాయువులను పీల్చుకోవడంతో పలువురు అస్వస్థతకు గురై మరణించినట్లు సంస్థ తెలిపింది. మరికొందరు ఆచూకీ లేకుండా పోయారని, నదిలో కొన్ని మృతదేహాలు తేలుతూ కనిపించాయని వెల్లడించింది. అయితే మృతుల సంఖ్యపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
కాగా, నైజీరియాలో చమురు దొంగతనాలు జరగడం మామూలే. ఇలాంటి ఘటనలు తరచూ ప్రాణనష్టం, పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. చమురు దొంగతనాలకు పేదరికం, నిరుద్యోగం ప్రధాన కారణాలని తెలుస్తోంది.


