కరాచీలోని పారా మిలటరీ విభాగం పాకిస్తాన్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై శనివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గులిస్తాన్–ఇ– జౌహార్ ప్రాంతంలోని ఈ కార్యాలయం గేట్ను వాహనంతో ఢీకొట్టిన సాయుధులు లోపలికి వస్తూనే కాల్పులకు దిగారని అధికారులు తెలిపారు. బలగాలు వెంటనే ధీటుగా స్పందించాయన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయినట్లు తెలిసిందన్నారు.
రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) నుండి విడిపోయిన ఉగ్రవాద ముఠా 'జమాత్-ఉల్-అహ్రార్' ప్రకటించుకుంది. 'ఖులాఫా-ఎ-రషీదీన్ ఇష్తిషాదీ బ్రిగేడ్' అనే ఆత్మాహుతి దళం ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది. పాకిస్తాన్లో ఇటీవల పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయి.
పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఉగ్రదాడిపై దర్యాప్తును ప్రారంభించాయి. కంట్రోల్ రూమ్, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉగ్రవాదులు లోపలికి ఎలా ప్రవేశించారనే కోణంలో విచారణ చేపట్టారు. కరాచీలో హై అలర్ట్స్ ప్రకటించారు.


