
కాబూల్: ఉక్రెయిన్పై రష్యా అత్యాధునిక బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్పై సైనిక చర్యలకు దిగిన రష్యాపై ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై తాలిబన్లు సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. అలాగే.. హింసాత్మక ఘటనలను ప్రేరేపించే చర్యల నుంచి ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని కోరారు. యుద్దం పరిష్కారం కాదని.. ఈ సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాలిబన్లు సూచించారు. అనంతరం ఉక్రెయిన్లో ఉన్న ఆప్ఘనిస్తాన్ ప్రజలు సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Statement concerning crisis in #Ukraine pic.twitter.com/Ck17sMrAWy
— Abdul Qahar Balkhi (@QaharBalkhi) February 25, 2022