39 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు
గాయపడినవారిలో 30 మంది పరిస్థితి విషమం
మొదటి రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం
మాడ్రిడ్: స్పెయిన్లో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొనడంతో 39 మంది మృతి చెందారు. దాదాపు వందమందికి పైగా గాయపడ్డారు. వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం మలగా నుంచి మాడ్రిడ్కు వెళ్తున్న ఒక హైస్పీడ్ రైలుకు ఆడమూజ్ సమీపంలో ప్రమాదం జరిగింది.
మొదటి రైలు వెనుక భాగం పట్టాలు తప్పి.. పక్కనే మరో రైలు ట్రాక్పై పడింది. ఎదురుగా వస్తున్న రెండో రైలును ఢీకొట్టింది. దీంతో రెండో రైలులోని మొదటి రెండు బోగీలు ట్రాక్పై నుంచి 4 మీటర్ల కిందకి పడి´ యాయి. ఈ రైలు ముందు భాగానికి అత్యంత తీవ్రమైన నష్టం వాటిల్లింది. కొన్ని బోగీలు నాలుగు మీటర్ల కట్ట కిందకు పడిపోయాయి. కొన్ని మెలి తిరిగిపోయాయి. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి దాదాపు 400 మంది ప్రయాణికులున్నారు.
కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ సుత్తులు ఉపయోగించి కిటికీలను పగలగొట్టుకుని బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకా వందల మంది ప్రయాణికులు శిథిలాల కింద ఉన్నారు. వారిని వెలికితీసే పనులు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదం కారణంగా మాడ్రిడ్, అండలూసియన్ నగరాలైన కార్డోబా, సెవిల్లె, మలగా, హుయెల్వా మధ్య హై–స్పీడ్ సర్వీసులను సోమవారం నిలిపివేశారు. రైలు పట్టాలు తప్పినప్పుడు గంటకు 179 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ‘ఒక క్షణం భూకంపం వచ్చినట్లు అనిపించిందని, రైలు పట్టాలు తప్పింది’ అని పట్టాలు తప్పిన రైలులో ఉన్న జర్నలిస్ట్ సాల్వడార్ జిమెనెజ్ తెలిపారు. మొదట పట్టాలు తప్పిన రైలు ప్రైవేట్ కంపెనీ ఇర్యోకు చెందినది. తీవ్రంగా నష్టపోయిన రెండో రైలు స్పెయిన్ ప్రభుత్వ రైలు కంపెనీ రెన్ఫేకు చెందినది.
హైస్పీడ్ రైలు నెట్వర్క్..
స్పెయిన్ యూరప్లో అతిపెద్ద హై–స్పీడ్ రైలు నెట్వర్క్ను కలిగి ఉన్న దేశం. మాడ్రిడ్, బార్సిలోనా, సెవిల్లె, వాలెన్సియా, మలగా తో సహా ప్రధాన నగరాలను కలుపు తూ 3,000 కిలోమీటర్లకు పైగా ప్రత్యేక ట్రాక్లు న్నాయి.


