ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా యుద్ధ విమానాలు | Singapore Scrambled Jets To Escort Air India Express Plane After Bomb Threat | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా యుద్ధ విమానాలు

Oct 16 2024 10:27 AM | Updated on Oct 16 2024 10:53 AM

Singapore Scrambled Jets To Escort Air India Express Plane After Bomb Threat

భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది.దేశవ్యాప్తంగా మంగళవారం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యింది. తాజాగా తాజాగా మధురై నుంచి సింగపూర్ వెళ్లిన ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.విమానం సింగపూర్‌కు బయలుదేరిన తర్వాత విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఈ-మెయిల్ వచ్చింది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 684కి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని చాంగీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా మళ్లించడానికి సింగపూర్‌ భద్రతా దళాలకు చెందిన రెండు ఫైటర్ జెట్‌లు రంగంలోకి దిగాయి. ఎయిరిండియా విమానానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లాయి.

కాగా, ఈ బెదిరింపుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పౌర విమానయాన భద్రతా సంస్థ భారత సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీల సాయం కోరింది. బాధ్యులను కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎయిరిండియా విమానానికి సింగపూర్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా రావడంపై సింగపూర్ రక్షణ మంత్రి ఎన్‌జీ ఎంగ్ హెన్ స్పందించారు. 

ఎయిరిండియా విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లడానికి రెండు ఆర్ఎస్ఏఎఫ్ ఎఫ్-15ఎస్‌జీలు రంగంలోకి దిగాయని తెలిపారు. విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లాయని, చివరకు విమానం చాంగీ విమానాశ్రయంలో రాత్రి (మంగళవారం) 10:04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎక్స్ వేదికగా ప్రకటించారు.

కాగా దేశవ్యాప్తంగా మంగళవారం 7 విమానాలకు బాంబు బెదిరింపు ఎదురయ్యింది. ఢిల్లీ నుంచి షికాగో వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానాన్ని కెనడాలోని ఓ విమానాశ్రయానికి మళ్లించి తనిఖీ చేశారు. అలాగే జైపూర్‌ నుంచి అయోధ్య మీదుగా బెంగళూరు వెళ్లే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం, దర్భంగా నుంచి ముంబయి వెళ్లే స్పైస్‌జెట్‌ విమానం, బాగ్‌డోగ్రా నుంచి బెంగళూరు వెళ్లే ఆకాశ ఎయిర్‌ విమానం, దమ్మం(సౌదీ అరేబియా) నుంచి లక్‌నవూ వెళ్లే ఇండిగో విమానం, అమృత్‌సర్‌-డెహ్రాడూన్‌-ఢిల్లీ అలయన్స్‌ ఎయిర్‌ విమానం, మదురై నుంచి సింగపూర్‌ వెళ్లే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement