Shubhanshu Shukla: ISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు | Indian Astronaut Shubhanshu Shukla Axiom-4 Mission Will Reach International Space Station Shortly | Sakshi
Sakshi News home page

Shubhanshu Shukla: ISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు

Jun 26 2025 4:05 PM | Updated on Jun 26 2025 7:41 PM

Shubhanshu Shukla Axiom-4 At Space Station Shortly

సాక్షి,ఢిల్లీ: అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఐఎస్‌ఎస్‌లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫలితంగా శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. 

శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్‌ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి  అడుగు పెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకు ముందు ఐఎస్‌ఎస్‌తో స్పేస్‌ డాకింగ్‌ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది.  

గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టిన ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. 

అమెరికా టూ అంతరిక్షం
భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌. పదేపదే వాయిదాల అనంతరం, యాగ్జియం–4 మిషన్‌ వాణిజ్య మిషన్‌ను వెంట తీసుకుని స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌–9 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్‌ రాకెట్‌ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్‌ పైలట్‌గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌గా శుభాంశు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్‌ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. 

(Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట)

అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్‌ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)తో అనుసంధానం అయ్యింది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్‌ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్‌ పెగ్గీ విట్సన్, మిషన్‌ స్పెషలిస్టులు స్లవోస్‌ ఉజ్నాన్‌స్కీ విస్నియెవ్‌స్కీ (పోలండ్‌), టైబర్‌ కపు (హంగరీ)తో కలిసి శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశిస్తారు. 

 

14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు 
శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే, ఇస్రో తరఫున శుభాంశు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద, యాక్సియం-4 మిషన్‌లో పాల్గొన్న  వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్‌లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది.

రాకేశ్‌ శర్మ తర్వాత శుభాంశు శుక్లా
రాకేశ్‌ శర్మ భారతదేశం తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామి. ఆయన 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన సోయుజ్ టి-11 రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆయన మొత్తం 7 రోజులు 21 గంటలు 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన భారతదేశాన్ని అంతరిక్షం నుంచి పరిశీలించి, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.

NASA: ISSలోకి శుభాంశు శుక్లా టీమ్

రాకేశ్‌ శర్మ తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన రెండో భారతీయుడే ఈ శుభాంశు శుక్లా. నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ  భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెడుతున్న సందర్భంలో రాకేశ్ శర్మే తనకు స్పూర్తంటూ శుభాంశు శుక్లా  పేర్కొన్నారు. 1984లో రాకేశ్ శర్మను చూసి ఎంతోమంది యువత అంతరిక్షం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఇప్పుడు శుభాంశు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ, తదుపరి తరం భారతీయులకు ప్రేరణగా నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement