మోదీ లొంగిపోయే రకం కాదు: పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు | Russia Putin Says Useless to pressure PM Modi And India | Sakshi
Sakshi News home page

మోదీ లొంగిపోయే రకం కాదు: పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు

Jun 5 2026 7:51 AM | Updated on Jun 5 2026 9:04 AM

Russia Putin Says Useless to pressure PM Modi And India

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో రష్యాతో సంబంధాలు తగ్గించాలని భారత ప్రధాని మోదీపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తీసుకురావడం సరైన పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిడి తెస్తే మోదీ లొంగిపోయే రకం కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్‌ను రష్యా విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించారు. దీంతో, పుతిన్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రపంచ వార్తా సంస్థల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ.. రష్యాకు భారత్‌ ఎప్పుడూ మిత్రదేశమే. భారత్ తన విదేశాంగ విధానాన్ని స్వతంత్రంగా నిర్ణయించే దేశం. ఏ దేశం ఒత్తిడి చేసినా భారత్ తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని లేదా తగ్గించాలని భారత నాయకత్వంపై ఒత్తిడి చేయడంలో ప్రయోజనం ఉండదు. భారత్ ఒక గొప్ప దేశం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. అలాంటి దేశం తన ప్రయోజనాలను బాగా అర్థం చేసుకుంటుంది. రష్యాకు భారత్‌ విశ్వసనీయ భాగస్వామి. రష్యాతో సంబంధాలు తగ్గించాలని భారత ప్రధాని మోదీపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తీసుకురావడం ఫలితం ఇవ్వదు’ అని స్పష్టం చేశారు.

రష్యా భారత్‌ను ఇప్పటికీ అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. పాశ్చాత్య ఒత్తిళ్ల మధ్య కూడా భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోందని రష్యా భావిస్తోంది. అమెరికాతో భారత సంబంధాలు పెరిగినా, రష్యా-భారత్ సంబంధాలపై మాస్కోకు పెద్దగా ఆందోళన లేదని పుతిన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఈ భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని చెప్పారు. అయితే, పరోక్షంగా అమెరికాను టార్గెట్‌ చేసే పుతిన్‌ ఇలా వ్యాఖ్యలు చేశారనే చర్చ నడుస్తోంది.

అమెరికా-భారత్ సంబంధాలపై వ్యాఖ్య
పుతిన్ వ్యాఖ్యల్లో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం అమెరికా-భారత్ సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు. భారత్ అమెరికాతో వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నప్పటికీ, అది రష్యా-భారత్ సంబంధాలకు ఎలాంటి ఆటంకం కాదని ఆయన అన్నారు. అంటే, భారత్ ఒకేసారి అమెరికా మరియు రష్యాతో మంచి సంబంధాలు కొనసాగించగలదని, ఇది భారత విదేశాంగ విధానంలోని ప్రత్యేకత అని పుతిన్ అభిప్రాయపడ్డారు.

ఎందుకు ఈ వ్యాఖ్యలు?
రష్యా, ఉక్రెయిన్‌ మధ్య 2022లో యుద్దం ప్రారంభమైన తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించగా, భారత్ మాత్రం తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించింది. తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకుంది. దీనిపై పాశ్చాత్య దేశాలు విమర్శలు చేసినప్పటికీ, భారత్ తన నిర్ణయం జాతీయ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేసింది.

భారత్-రష్యా మధ్య ప్రధాన రంగాలు:

  • రక్షణ సహకారం

  • అణు విద్యుత్

  • అంతరిక్ష పరిశోధన

  • ఇంధన భద్రత

  • వాణిజ్యం

  • సాంకేతికత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement