బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా రిషి సునాక్‌

Rishi Sunak Will Be The First Indian Origin UK Prime Minister - Sakshi

లండన్‌: బ్రిటన్‌ కొత్త ప్రధానిగా భారత సంతతి ఎంపీ రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకూ  పోటీలో ఉన్న పెన్నీ మోర్డాన్‌ రేసు నుంచి తప్పుకున్నట్లు వెల్లడించడంతో రిషి సునాన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో బ్రిటన్‌ ప్రధానిగా మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు రిషి సునాక్‌. బ్రిటన్‌ పార్లమెంట్‌లో సునాక్‌కు 193 మంది ఎంపీల మద్దతు ఉండగా.. మోర్డాన్‌కు 27 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. 

దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ట్రస్‌ రాజీనామాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో టోరీ సభ్యులు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు. ఆయనే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్‌ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్‌ను వరించింది. నెలన్నర రోజుల క్రితం లిజ్‌ట్రస్‌ చేతిలో ఓటమిపాలైన అదే సునాక్‌.. నేడు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయనకు సంబంధించి  ఐదు కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం.

 ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు.

ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా, తొలి హిందూ వ్యక్తిగా నిలిచారు. అలాగే.. తొలి శ్వేత జాతీయేతర ప్రధానిగా గుర్తింపు పొందారు. 

 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి రిషి విజయం సాధించారు. 2020లో బోరిస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక తన తొలి కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా రిషిని నియమించారు. 

కరోనా సంక్షోభ సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం వందల కోట్ల పౌండ్ల ప్యాకేజీ తీసుకొచ్చి రిషి మంచి గుర్తింపు పొందారు.

రిషిపై కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. ఆయన భార్య ట్యాక్స్ వివాదం, అమెరికా గ్రీన్‌ కార్డు, బ్రిటన్‌ జీవన వ్యయం సంక్షోభం సమయంలో ఆయన కాస్త నెమ్మదిగా స్పందించారనే ఆరోపణలు ఉన్నాయి.

డౌన్‌స్ట్రీట్‌లో సమావేశానికి హాజరై కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిషికి జరిమానా విధించారు.

రిషి సునాక్‌ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. రిషి గ్రాండ్ పేరెంట్స్ పంజాబ్‌కు చెందినారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదీ చదవండి: చరిత్రకెక్కిన జిన్‌పింగ్‌.. మావో జెడాంగ్‌ తర్వాత తొలినాయకుడిగా..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top