
వాషింగ్టన్: అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తును ముగించాలనే తొందరపాటు పలువురిలో కనిపిస్తున్నదని అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్టీఎస్బీ) చైర్పర్సన్ జెన్నిఫర్ హోమెండి పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటివరకూ వచ్చిన నివేదికలు ఊహాజనితమైనవేనని ఆయన అన్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-7 ప్రమాదంపై ఎన్టీఎస్బీ సాయంతో భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ)దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రస్తుత తరుణంలో ఊహాగానాలకు దూరంగా ఉండాలని ఏఏఐబీ, ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్బెల్ విల్సన్ ప్రజలను కోరారు. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇటీవలి మీడియా నివేదికలు ఊహాజనితమైనవి. ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. పూర్తి దర్యాప్తునకు ఇంకా సమయం పడుతుంది. ఏఏఐబీ కొనసాగుతున్న దర్యాప్తుకు మద్దతు ఇస్తున్నాం’ అని ఎన్టీఎస్బీ ‘ఎక్స్’లో ఒక పోస్టులో తెలిపింది.
Statement from NTSB Chairwoman Jennifer Homendy:
“Recent media reports on the Air India 171 crash are premature and speculative. India’s Aircraft Accident Investigation Bureau just released its preliminary report. Investigations of this magnitude take time. We fully support the…— NTSB Newsroom (@NTSB_Newsroom) July 18, 2025
ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్లైనర్లోని రెండు ఇంధన నియంత్రణ స్విచ్లను టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకు కటాఫ్ స్థానాన్ని గుర్తించారు. 10 సెకన్ల తర్వాత స్విచ్లను పునరుద్ధరించినప్పటికీ, విమానం అప్పటికే థ్రస్ట్ను కోల్పోయింది. ఇది ప్రమాదానికి దారితీసింది. అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్.. కెప్టెన్ సుమీత్ సభర్వాల్ను ఎందుకు కట్ఆఫ్ చేశారని అడగటం వినిపిస్తుంది. అందుకు ప్రతిగా అతను అలా చేయలేదని చెప్పడం రికార్డయ్యింది. ఈ నివేదిక నేపధ్యంలో భారతదేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ దేశంలోని అన్ని బోయింగ్ 737, 787 విమానాలలో ఇంధన నియంత్రణ వ్యవస్థలను తనిఖీ చేయాలని ఆదేశించింది. పరిశీలన దరిమిలా వాటిలో ఎటువంటి లోపం లేదని ఎయిర్ ఇండియా ప్రకటించింది.