ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా మరో వ్యూహం! | US Sends 2500 Marines Warship To Middle East As Iran Israel Conflict Intensifies, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా మరో వ్యూహం!

Mar 14 2026 9:09 AM | Updated on Mar 14 2026 9:50 AM

Us Sends 2500 Marines Warship To Middle East As Iran Conflict Intensifies

ఇరాన్‌తో యుద్ధం మొదలై దాదాపు రెండు వారాలు గడుస్తున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచింది. ఇరాన్‌పై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మిడిల్‌ ఈస్ట్‌కు అమెరికా మెరైన్‌ కమాండోలను తరలించింది. సముద్ర మార్గంలో మెరైన్‌ దళాలను మోహరించింది. యూఎస్‌ఎస్‌ ట్రిపోలి యుద్ధనౌకలో 2500 మెరైన్‌ కమాండోలతో పాటు 20 యుద్ధ విమానాలు, ఫైటర్‌ జెట్లు మధ్యప్రాచ్యానికి పంపినట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు.

మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నిన్న (శుక్రవారం) భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. నగరం నడిరొడ్డున అత్యంత శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ఫిరదౌసీ స్క్వేర్‌ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఖుద్స్‌ డే ప్రదర్శనల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఉండగా ఈ ఉదంతం జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్‌ పేర్కొంది. పేలుడు కారణమేమిటో తెలియకపోయినా ఆ ప్రాంతంపై దాడి చేస్తామని శుక్రవారం ఉదయమే ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించింది. అంతేగాక ఫిరదౌసీ స్క్వేర్‌ వద్ద ర్యాలీలు మొదలయ్యేందుకు కాసేపటి ముందే టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌–అమెరికా భారీ స్థాయి వైమానిక దాడులకు దిగాయి.

ఇదిలా ఉండగా..  ఇరాన్‌.. ఇజ్రాయెల్‌, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విస్తృత దాడులను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరిగే చమురులో ఐదో వంతు ప్రయాణించే హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ దాదాపుగా మూసివేసింది. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, ఇతర లక్ష్యాలపై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల లెబనాన్‌లో సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటివరకు దాదాపు 800 మంది మరణించగా.. 8.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది.


 

Advertisement
 
Advertisement
Advertisement