ఖర్గ్ ఐలాండ్పై అమెరికా దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్.. అమెరికా చమురు మౌలిక సదుపాయాలను బూడిద చేస్తామంటూ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఇరాన్కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు చేసింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశామంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా, ‘ఇరాన్ ఇప్పటికే లొంగుబాట పట్టిందని.. మనందరినీ వేధిస్తున్న క్యాన్సర్ను నిర్మూలించానంటూ కూడా జీ7 దేశాధినేతలతో జరిపిన వర్చువల్ మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్పై తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతమైందని ప్రకటించుకున్నారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని దేశాధినేతలు ట్రంప్కు సూచించారు. అంతకుముందు ట్రూత్సోషల్ పోస్టుల్లో ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఈ మతిలేని మూర్ఖులకు ఏం జరగనుందో చూస్తూండండి! వారి నేవీ, ఎయిర్ఫోర్స్, క్షిపణులు, డ్రోన్లు అన్నీ మట్టికరిచాయి. సర్వమూ నాశనమవుతోంది.
నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచమంతటా అమాయకులను చంపుతూ వస్తోంది. 47వ అమెరికా అధ్యక్షునిగా నేను వాళ్లను చంపుతున్నా. ఎంతో గొప్ప విషయమిది!’’ అని చెప్పుకున్నారు. ఇరాన్ వద్ద పోగుపడ్డ యురేనియం నిల్వల స్వా«దీనంపై ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదని ట్రంప్ చెప్పారు. అయితే మున్ముందు పరిస్థితి మారే ఆస్కారం లేకపోలేదన్నారు.


