ఇరాన్ను దుర్భేద్యంగా మార్చిన యుద్ధ తంత్రం
సైనిక యూనిట్లకు ఎక్కడికక్కడ స్వయం ప్రతిపత్తి
దాంతో నాయకుడు లేకున్నా స్వతంత్రంగా పోరు
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడ్డాయి. సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు అగ్ర నాయకత్వాన్నంతా దాదాపుగా తుడిచిపెట్టేశాయి. ఆ దాడుల్లో ఆర్మీ చీఫ్ సయ్యద్ అబ్దుల్ ఇబ్రహీం ముసావీ, ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ మొహమ్మద్ పక్పూర్, రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదేతో పాటు మరో 30 మందికి పైగా పౌర, సైనిక అగ్ర నేతలను అంతం చేశాయి. అంతటితో ఆగకుండా రెండు వారాలుగా ఇరాన్పై ఎడతెరిపి లేని దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఆ దేశ డిఫెన్స్, దాడుల వ్యవస్థలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తూ వస్తున్నాయి. పైగా నూతన సుప్రీం నేత, ఖమేనీ కుమారుడు మొజ్తబా కూడా తొలి రోజు దాడిలోనే గట్టిగా గాయపడ్డట్టు వార్తలొస్తున్నాయి.
అయినా సరే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశించినట్టుగా ఇరాన్ను ఓడించడం దేవుడెరుగు, ఆ దేశాన్ని కాస్త కూడాలొంగదీయలేకపోయారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ముమ్మర దాడులతో విరుచుకుపడుతూనే ఉంది. పశి్చమాసియా మొత్తాన్నీ యుద్ధక్షేత్రంగా మార్చేసింది. ఇంకెంత కాలమైనా పోరాడేందుకు సిద్ధమంటోంది. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోయినా, వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నా, డెడ్లీ కాంబినేషన్గా పరిగణించే ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడులను దీటుగా ఎదుర్కోవడం ఇరాన్కు ఎలా సాధ్యపడుతోంది? ఇందుకు సమాధానం ఒక్కటే. ఆ దేశం ముందుచూపుతో సిద్ధంచేసి పెట్టుకున్న మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతం! అత్యంత శక్తిమంతుడైన శత్రువుపై ఇరాన్కు గెలుపు సాధించి పెట్టలేకపోయినా, ఓటమిని మాత్రం అసాధ్యంగా మార్చే గమ్మత్తైన ఏర్పాటిది!!
సైనికాధికార వికేంద్రీకరణ
ఇరాన్ మొజాయిక్ రక్షణ సిద్ధాంతానికి 2003 ఇరాక్ యుద్ధంతో బీజం పడింది. దీని రూపకర్త నాటి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) డైరెక్టర్ మొహమ్మద్ అలీ జఫారీ. 2003 యుద్ధంలో సద్దాం హుస్సేన్ సేనలను తుడిచిపెట్టేందుకు అమెరికాకు కేవలం 26 రోజుల సమయం సరిపోయింది. నాయకుని పలాయనంతో ఇరాక్ సైన్యం చేష్టలుడిగింది. తమకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ సమన్వయం చేసే వ్యవస్థ లేక ఉన్నపళంగా చేతులెత్తేసింది. ఈ ఉదంతాన్ని ప్రత్యక్షంగా గమనించిన జఫారీ ఇరాన్కు ఎప్పటికీ అలాంటి గతి పట్టకుండా జాగ్రత్త పడాలని నిశ్చయించుకున్నారు. ఆ ఆలోచనల్లోంచి 2005లో పుట్టుకొచి్చందే మొజాయిక్ రక్షణ సిద్ధాంతం. ఒక్కముక్కలో చెప్పాలంటే అధికార వికేంద్రీకరణే దీని మూలమంత్రం.
ఇందులో భాగంగా సైనిక, ఐఆర్జీసీ బలగాలను పాక్షిక స్వయంప్రతిపత్తితో కూడిన 31 విభాగాలుగా తీర్చిదిద్దారు. అలా రాష్ట్రానికి ఒకటి చొప్పున 31 ప్రొవిన్షియల్ కమాండ్లు ఏర్పాటయ్యాయి. ప్రతి కమాండ్కూ సొంత ప్రధాన కార్యాలయం, కమాండ్–కంట్రోల్ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లతో కూడిన ఆయుధ వ్యవస్థ, సమీకృత బసీజ్ పోరాట యూనిట్లు, నావికా దళ విభాగాలు, నిఘా వ్యవస్థలు, ఆయుధాగారం వంటివి ఉంటాయి. నాయకత్వం అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రతి కమాండ్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పోరాటం కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2007లో జఫారీ ఐఆర్సీజీ చీఫ్ కమాండర్గా ఎంపికయ్యా మొజాయిక్ సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు.
పొరుగునుంచే పాఠాలు
ఇరాక్లో మాదిరిగా నాయకత్వాన్ని అంతం చేసి తమను లొంగదీసుకోవడం సాధ్యపడే విషయం కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరాఘ్చీ ముందే స్పష్టం చేశారు. యుద్ధం మొదలైన రెండో రోజు మార్చి 1వ తేదీనే ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్
ఎవరీ జఫారీ?
ఆద్యంతం ఐఆర్జీసీతోనే ముడిపడ్డ కెరీర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫారీది. ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాక్ సరిహద్దుల్లోని కుర్దిస్తాన్ ప్రావిన్స్లో నిఘా విభాగంలో చేరారు. అనంతరం ఇరాక్తో పదేళ్ల యుద్ధంలో పోరాడారు. 1992 నాటికి ఐఆర్జీసీ పదాతి దళాల కమాండర్గా ఎదిగారు. 2005లో ఐఆర్జీసీ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్గా ఎంపికయ్యాక మొజాయిక్ సిద్ధాంతానికి పదును పెట్టారు. 2003లో ఇరాక్ను అమెరికా ఆక్రమించిన తీరు నుంచి నేర్చుకున్న పాఠాలనే అందుకు ముడిసరుకుగా మార్చుకున్నారు.
నిద్రలేని రాత్రులే
ఇరాన్ ముందుచూపుతో ఏర్పాటు చేసుకున్న మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ నేటి అత్యవసర పరిస్థితుల్లో అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఫిబ్రవరి 28న అనూహ్య రీతిలో భారీ దాడులకు గురైనా ఖమేనీతో పాటు అత్యున్నత నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినా గంటల వ్యవధిలోనే ఇరాన్ బలగాలు తేరుకున్నాయి. ఇజ్రాయెల్పైనే గాక గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఎడాపెడా దాడులతో విరుచుకుపడ్డాయి.
శత్రు దాడులకు ఎక్కడికక్కడ దీటుగా బదులిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా స్వీయ నిర్ణయాలతో విమానాశ్రయాలు, చమురు, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాంకుల వంటి పౌర వ్యవస్థలపైనా దాడులతో గుబులు పుట్టిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం లేని లోటు పెద్దగా కనిపించకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా రెండింటికీ నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ ప్రస్తుత యుద్ధ తంత్రాన్ని పైలట్ ప్రత్యక్ష పర్యవేక్షణతో పని లేకుండానే విమానాన్ని సురక్షితంగా నడిపే ఆటో పైలట్ మోడ్తో అంతర్జాతీయ రక్షణ నిపుణులు పోలుస్తున్నారు.


