డ్రగ్స్ కాపిటల్‌గా ఫిలడెల్ఫియా.. ఫుట్‌పాత్‌లపై ‘బానిసల’ వికృత చేష్టలు! | Video: Philadelphia as drugs capital, people act like zombies - Sakshi
Sakshi News home page

ఫిలడెల్ఫియా ఫుట్‌పాత్‌లపై డ్రగ్స్‌ బానిసల వికృత చేష్టలు!

Sep 2 2023 9:07 AM | Updated on Sep 2 2023 9:31 AM

philadelphia people addict becoming zombies - Sakshi

అమెరికాలోని ఫిలడెల్ఫియా డ్రగ్స్ కాపిటల్‌గా మారిపోయింది. ఇక్కడి జనం ప్రమాదకరమైన డ్రగ్ ‘ట్రాంక్’ బారిన పడి కెన్సింగ్టన్ వీధుల్లో వికృత చేష్టలకు దిగుతున్నారు. మత్తులో మునిగిపోయి, తామేమి చేస్తున్నామో తమకే తెలియని స్థితిలో రోడ్ల మీద తిరుగాడుతున్నారు. 

‘ట్రాంక్’కు బానిసగా మారిన ఒక వ్యక్తి తన వీడియో క్లిప్‌ను టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఇదిమొదలు ఇటువంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో పలువురు జాంబీ డ్రగ్స్ తీసుకుంటూ వింతగా ప్రవర్తించడం కనిపిస్తుంది. ఇంతేకాకుండా మరికొందరు మద్యం తీసుకోవడం, ధూమపానం చేయడం, కాలి వేళ్లకు డ్రగ్స్‌ ఇంజెక్ట్ చేయడం ద్వారా మత్తులోకి దిగడం లాంటి దృశ్యాలు ఈ వీడియోలలో కనిపిస్తున్నాయి. 

‘ట్రాంక్’ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?
మీడియాకు అందిన సమాచారం ప్రకారం జిలాజైన్ డ్రగ్ లేదా ‘ట్రాంకో’ను విరివిగా వినియోగిస్తున్నవారి సంఖ్య అమెరికాలో విపరీతంగా పెరిగిపోయింది. ‘ట్రాంక్‌’ని ‘జాంబీ డ్రగ్స్’ అని కూడా అంటారు. తొలుత దీనిని ఇది జంతువుల చికిత్సకు ఉపయోగించేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించింది. అయితే క్రమంగా దీనిని మత్తు పదార్థంగా ఉపయోగించడం ప్రారంభించారు. ‘ట్రాంక్’ను మత్తుపదార్థాలైన హెరాయిన్, కొకైన్, ఫెంటానిల్‌లను మరింత శక్తివంతం చేయడానికి ఉపయోగిస్తారు.

 

ఫిలడెల్ఫియా ఆరోగ్య అధికారులు గత నెలలో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. డ్రగ్స్ మహమ్మారి నగరాన్ని సంక్షోభంలో ముంచిందని పేర్కొన్నారు. ‘జిలాజైన్ డ్రగ్‌ ఫిలడెల్ఫియాను తీవ్రంగా దెబ్బతీసింది. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల మరణాల సంఖ్య పెరిగింది. దీనిని తీసుకునే వ్యక్తులు తీవ్రమైన గాయాల బారిన పడుతున్నారు. ఈ డ్రగ్‌ మనిషి శరీర భాగాలను క్షీణింపజేస్తుంది. మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడానికి నగరంలోని స్వచ్ఛంద భాగస్వాములతో కలిసి పని చేస్తున్నామని’ ఫిలడెల్ఫియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్‌ బోర్డ్ ఆఫ్ హెల్త్ పేర్కొంది.

ఈ విషయమై స్పందించిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు డ్రగ్స్ కలిగించే చెడు ప్రభావాలను ప్రత్యక్షంగా చూశామని తెలిపారు. సావేజ్ సిస్టర్స్ వ్యవస్థాపకురాలు సారా లారెల్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలలో ఈ డ్రగ్‌ వినియోగం మరింతగా పెరిగిందన్నారు. దీనిని అరికట్టడంతో అటార్నీ లారీ క్రాస్నర్ విఫలమయ్యారని ఆరోపించారు. నేరాలను అరికట్టడంలో, డ్రగ్స్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన 2022లో లారీ క్రాస్నర్ సస్పెండ్‌ అయ్యారు. అయితే దీనికి సంబంధించిన విచారణ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది.
ఇది కూడా చదవండి: అమ్మకానికి పాక్‌? సౌదీ యువరాజు పర్యటనలో పక్కా డీల్‌?
 

Advertisement
 
Advertisement
Advertisement