
వాషింగ్టన్: ఇరాన్లోని అణుకేంద్రాలపై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ నిపుణుల అంచనాలను తలకిందులు చేస్తూ ప్రారంభమయ్యింది. అమెరికా సైన్యానికి చెందిన బీ-2 బాంబర్ల బృందం మిస్సోరీలోని వారి స్థావరం నుండి బయలుదేరి, పసిఫిక్ ద్వీపం గువామ్ వైపు వెళుతుందని, ఇరాన్పై దాడికి దిగేముందు అమెరికా తన సైన్యానికి ముందస్తుగా స్థావరం కల్పించే అవకాశం ఉందని నిపుణులు భావించారు. అయితే దీనికి భిన్నంగా.. దాడులకు ముందుగా బ్యాట్ వింగ్డ్, బీ-2 స్టెల్త్ బాంబర్ల బృందం 18 గంటల పాటు రహస్యంగా తూర్పు వైపు ప్రయాణించిందని, తమ కమ్యూనికేషన్లను కనిష్టంగా ఉంచిందని, గాల్లోనే ఇంధనం నింపుకున్నదని అమెరికా సైన్యం వెల్లడించింది.
బాంబర్లు ఇరానియన్ గగనతలానికి చేరుకోగానే, యూఎస్ జలాంతర్గామి 25కు పైగా టోమాహాక్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇరానియన్ ఫైటర్ జెట్లు.. అమెరికా ఫైటర్ జెట్లు, బాంబర్ల ముందు దిగదుడుపుగా మారిపోయాయి. ఇరాన్లోని మూడు ప్రధాన అణు స్థావరాలపై అమెరికాకు చెందిన బీ -2 స్టెల్త్ బాంబర్లు భీకర దాడి చేశాయి. 2001సెప్టెంబర్ 11న అల్ ఖైదా అమెరికాపై జరిపిన దాడుల తర్వాత జరిగిన అతిపెద్ద దాడులుగా వీటిని నిపుణులు అభివర్ణిస్తున్నారు.
బీ-2 బాంబర్లు.. 14 బంకర్-బస్టింగ్ జీబీయూ-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్లను జారవిడిచాయి. ఇవి ఒక్కొక్కటి 30 వేల పౌండ్ల బరువు ఉంటుంది. ఈ ఆపరేషన్లో 125కు పైగా సైనిక విమానాలు పాల్గొన్నాయని పెంటగాన్ తెలిపింది. అమెరికా సైనిక విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ అద్భుతమైన వ్యూహాత్మక విజయం. ఇరానియన్లు అమెరికన్ విమానాల దాడులను ఎదుర్కోలేకపోయారని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అణు కేంద్రంలో ఆరు రంధ్రాలు.. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి