వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా నివసిస్తూ, కమర్షియల్ ట్రక్కులను నడుపుతున్న వలసదారులపై యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అరిజోనాలోని యుమా సెక్టార్ కేంద్రంగా చేపట్టిన ‘ఆపరేషన్ చెక్మేట్’లో మొత్తం 52 మందిని అరెస్టు చేయగా, అందులో 30 మంది భారతీయులు ఉండటం గమనార్హం.
అక్రమ డ్రైవర్లే లక్ష్యంగా..
మే 11 నుండి 15 వరకు జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్ కేవలం అక్రమ వలసదారుల కోసం మాత్రమే కాదు, రవాణా రంగంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న వారిని గుర్తించేందుకు చేపట్టారు. అరెస్టు చేసిన 52 మందిలో 36 మంది సెమీ ట్రక్ డ్రైవర్లు కాగా, అందులో మెజారిటీ వాటా భారతీయులదే. మిగిలిన వారు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు.
నకిలీ పత్రాల బాగోతం
అరెస్టు అయిన వారిలో చాలా మంది కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా తదితర రాష్ట్రాలు జారీ చేసిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్లను కలిగి ఉండటం గమనార్హం. కొందరి దగ్గర ఎటువంటి లైసెన్స్లు లేవు. మరికొందరు గతంలో పొందిన వర్క్ ఆథరైజేషన్ పత్రాలను గడువు ముగిసినా, వాటిని ఉపయోగిస్తూ దొరికిపోయారు. ఈ వ్యవహారంపై యూఎస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
స్వదేశానికి తరలింపు
ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం అమెరికా రహదారులపై భద్రతను మెరుగుపరచడమేనని యుమా సెక్టార్ యాక్టింగ్ చీఫ్ పెట్రోల్ ఏజెంట్ డస్టిన్ కాడల్ తెలిపారు. అక్రమంగా ఉన్నవారు భారీ వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం, అరెస్టయిన వారందరినీ త్వరలోనే వారి స్వదేశాలకు పంపించనున్నారు. ఇటీవల భారత సంతతి డ్రైవర్లు ఘోర ప్రమాదాలకు కారణమవుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, అమెరికా కొత్త విధానాలను అమలు చేస్తోంది.
ఇది కూడా చదవండి: మరో కీలక జలసంధి మూసివేతకు ఇరాన్ హెచ్చరిక


