క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న నెత‌న్యాహు! | Benjamin Netanyahu Opens Up About Prostate Cancer Diagnosis And Recovery, Check More Details Inside | Sakshi
Sakshi News home page

క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న నెత‌న్యాహు!

Apr 25 2026 1:53 AM | Updated on Apr 25 2026 1:33 PM

Netanyahu Treated Early-stage Prostate Cancer Revelas Why He-Hide

ఇజ్రాయెల్ ప్ర‌ధాన‌మంత్రి బెంజ‌మిన్ నెత‌న్యాహు ప్రొస్టేట్‌  క్యాన్స‌ర్ వ్యాధి బారిన ప‌డ్డారు. తనకు క్యాన్సర్‌ సోకిన విషయాన్ని నెతన్యా హునే స్వయంగా పేర్కొన్నారు అయితే త‌న‌కు వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని, ప్రొస్టేట్ క్యాన్స‌ర్ నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్లు నెత‌న్యాహు ప్ర‌క‌టించారు. 

ఇటీవ‌ల తొలిద‌శ ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న‌ట్లు నెత‌న్యాహు త‌న సామాజిక మాధ్య‌మం ‘ఎక్స్‌’ వేదిక‌గా స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప‌శ్చిమాసియాలో యుద్ధం కార‌ణంగా త‌న ఆరోగ్య నివేదిక బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు తానే అడ్డుప‌డిన‌ట్లు వెల్ల‌డించారు. ఒక‌వేళ ఈ విష‌యం బ‌య‌టికొస్తే ఇరాన్ ప్ర‌భుత్వం త‌ప్పుడు ప్ర‌చారం చేసే అవ‌కాశముంద‌ని, అందుకే 2 నెల‌ల పాటు త‌న వార్షిక ఆరోగ్య నివేదిక‌ను వాయిదా వేయాల‌ని అధికారుల‌ను అభ్య‌ర్థించిన‌ట్లు  ట్వీట్‌లో తెలిపారు. 

అయితే దేవుడి ద‌య వ‌ల్ల ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌న్నారు. తనకు ప్రారంభ దశలోనే ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే విజయవంతమైన చికిత్స పూర్తయిందని స్పష్టం చేశారు. తన ఆరోగ్య పరిస్థితిపై వివరిస్తూ, ప్రోస్టేట్‌లో చిన్న స్థాయి సమస్యను వైద్యులు గుర్తించినట్లు తెలిపారు. అది ఇతర అవయవాలకు వ్యాపించకముందే చికిత్స తీసుకున్నట్లు వెల్లడించారు. 

దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ సమస్య ఎదురయ్యిందని, అ‍ప్పటికే ప్రొస్టేట్‌లో ఒక సెంటీమీటర్ కంటే చిన్న సైజులో మచ్చ గుర్తించినట్లు చెప్పారు. దీనిని టెస్ట్ చేయగా, క్యాన్సర్ తొలి దశలో ఉన్నట్లు తేలిందన్నారు.  ఈ నేపథ్యంలోనే జెరూసలేంలోని హదస్సా ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆ సమస్య పూర్తిగా తగ్గిపోయిందని వెల్లడించారు. 

అంతేకాదు ఇజ్రాయెల్ ప్రజలు తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు సమయానికి పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. అయితే ఇరాన్‌తో యుద్ధం సమయంలో నెతన్యాహు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తన మరణ వార్తలను ఖండించిన నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రజలతో కాఫీ తాగుతున్న వీడియోలను షేర్ చేసుకున్నారు. 

అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఏఐతో నెతన్యాహు వీడియోను సృష్టించారని పేర్కొంది. దీంతో నెతన్యాహు మరోసారి స్వయంగా తన ఫోన్‌లో తీసిన వీడియోనూ సామాజిక మాధ్యమంలో షేర్ చేసుకుంటూ తాను ఇంకా బతికే ఉన్నానని, ఇరాన్ తప్పుడు ప్రచారం మానుకోవాలని పరోక్షంగా ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement