
ఏకంగా 70 అంతస్తుల భవనం అంత ఎత్తున్న భారీ గ్రహశకలం ఈ నెల 28న భూమికి సమీపానికి రాబోతోంది. సైంటిస్టులు దీనికి ‘అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ’ అని పేరుపెట్టారు. ఈ నెల 28న ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్(జేపీఎల్) తొలుత గుర్తించింది. ఇది భూమికి అతి సమీపంలోకి.. అంటే 3.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు.
ఇది భూమికి, చంద్రుడికి మధ్యనున్న దూరానికి 9 రెట్లు అధికం. సమీపం నుంచి దూసుకెళ్లే ఈ అస్టరాయిడ్ వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. గ్రహ శకలాలలపై మరిన్ని పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది సెకన్కు 9.43 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని, సమీపం నుంచే క్షుణ్నంగా పరిశీలించవచ్చని అంటున్నారు.
ఇదొక అరుదైన అవకాశమని చెబుతున్నారు. భవిష్యత్తులో భూమికి సమీపంలోకి రాబోయే గ్రహ శకలాలు, వాటి నుంచి వాటిల్లే ముప్పు, ఆ ముప్పు తప్పించే మార్గాలపై అధ్యయనానికి ‘అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ’ రాకను ఉపయోగించుకుంటామని సైంటిస్టులు వెల్లడించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్