సరిగ్గా... జూలై ఎనిమిదవ తేదీ బుధవారం మధ్యాహ్నం 4.40 నిమిషాలకు ఏం జరిగిందో తెలుసా? ఒక అరుదైన ఘట్టం నమోదైంది. ప్రపంచ జనాభాలో 99 శాతం మంది సూర్యుడిని చూడగలిగారు. అది కూడా ఒకే ఒక్క నిమిషం మాత్రమే. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఆగ్నేయాసియా దేశాలు కొన్ని, అంటార్కిటికాలు మాత్రమే చీకట్లో ఉండిపోయాయి! ఇలా ఎందుకంటే సూర్యుడి చుట్టూ తిరిగే భూమి ఒకపక్కకు వాలి ఉంటుందని మనం పుస్తకాల్లో చదువుకున్నాం.
జూన్, జూలైలో ఈ వాలు సూర్యాభిముఖంగా ఉంటుంది. ఫలితంగా కొన్నిసార్లు భూమి ఒక ప్రత్యేక స్థానంలోకి వచ్చి చేరుతుంది. సూర్యుడి వెలుగు భూమ్మీద అత్యధిక ప్రాంతంపై పడుతూ ఉంటుందన్నమాట. ఈ ఏడాది జూలై ఎనిమిదవ తేదీ కూడా ఒకటి. ఈ రోజు గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్ ప్రకారం ఉదయం 11.10 గంటలకు మొత్తం 820 కోట్ల మంది ప్రజలకు సూర్యుడి వెలుతురును పొందగలిగారు. అలాగని అన్ని చోట్లా పట్టపగల్లాంటి ప్రకాశం లేదులెండి.
ఈ భాగ్యం 690 కోట్లమందికి దక్కితే... దీపాల అవసరం లేనంత వెలుగును ఇంకో 58 కోట్ల మంది అనుభవించారు. ఆకాశం నల్లబడి.. దిగంతం ప్రకాశవంతంగా ఉన్న పరిస్థితి ఇంకో 49 కోట్ల మందికి లభించింది. చీకటిపడే ముందు లీలగా కనిపించే వెలుతురును 24.9 కోట్ల మంది చూశారు. సుమారు 8.3 కోట్ల మంది అంటే ప్రపంచ జనాభాలో ఒక్క శాతం మంది మాత్రమే నిశిరాత్రిలో ఉండిపోయారు. ప్రపంచ జనాభాలో 90 శాతం ఉత్తరార్ధగోళంలోనే ఉంటుందన్నది ఒక విశేషమైతే.. 99 శాతం మందికి ఒకే ఒక్క నిమిషం సూర్యుడి దర్శనం లభించడం ఇంకో విశేషం అన్నమాట.
– సాక్షి, నేషనల్ డెస్క్


