మాల్దీవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు! | Maldives Orders Indian Officials To Leave By May 10 After Military Pact With China | Sakshi
Sakshi News home page

భారత బలగాలకు మాల్దీవుల అధ్యక్షుడి అల్టిమేటం

Mar 5 2024 2:55 PM | Updated on Mar 5 2024 3:43 PM

Maldives Orders Indian Officials To Leave By May 10 After Military Pact With China - Sakshi

మాలె: మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. మే 10 తర్వాత భారత్‌కు చెందిన ఓ ఒక్క మిలిటరీ సిబ్బంది తమ దేశంలో ఉండకూదని తెలిపారు. కనీసం సివిల్‌ డ్రెస్సుల్లో కూడా తమ భూభాగంలో తిరగడానికి వీలు లేదంటూ మంగళవారం పేర్కొన్నారు. సైనిక సహకారంపై చైనాతో మాల్దీవులు కీలక ఒప్పందం కుదుర్చుకున్న గంటల వ్యవధిలోనే ముయిజ్జు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం

‘భారత సైన్యం ఉపసంహరణలో మా ప్రభుత్వం విజయం సాధించింది. కానీ దీనిని చూసి తట్టుకోలేని కొంతమంది (విపక్షాలు) తప్పుడు విషయాలను వ్యాప్తిచేస్తున్నారు. కొత్త ట్విస్ట్‌లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ మిలిటరీ ఇక్కడి నుంచి వెళ్లడం లేదని.. వారు తమ యూనిఫామ్‌లను పౌర దుస్తులుగా మార్చుకొని మళ్లీ తిరిగి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దు. మే 10 తర్వాత భారత బలగాలు మాల్దీవుల్లో ఉండవు. యూనిఫామ్‌లో అయినా లేదా సివిల్‌ దుస్తుల్లోనూ ఎవరిని ఉండనివ్వం’ అని స్పష్టం చేశారు.
చదవండి: Melbourne: ‘డ్రాగన్‌’కు చెక్‌..! సింగపూర్‌ కీలక నిర్ణయం

మాల్దీవులలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనిక సిబ్బందిని మార్చి 10లోగా మిగతా రెండు స్థావరలాల్లోని బలగాలను మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని మాల్దీవులు విదేశాంగమంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై ఢిల్లీలో ఫిబ్రవరి 2న ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు భారత్‌ పెట్టిన షరతును మాల్దీవులు అంగీకరించింది. దీంతో గతవారమే మాల్దీవుల్లో బాధ్యతలు స్వీకరించడానికి భారత సాంకేతిక బృందం అక్కడికి చేరుకుంది

కాగా మాల్దీవుల్లో మూడు వైమానిక స్థావరాల్లో 88 మంది భారత మిలిటరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు రెండు హెలికాప్టర్లు ఒక డోర్నియర్ విమానాల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా మాల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్యం కోసం తరలింపు వంటి సేవలను అందిస్తున్నారు. అయితే ముయిజ్జు గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌పై వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement