
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన వైమానిక దాడుల్లో 29 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. గాజాలో ఉద్రిక్తతలు తగ్గించటంతో పాటు, కాల్పుల విరమణ ఒప్పందం ప్రయత్నాల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకన్ ఇజ్రాయెల్కు వెళ్లారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం.. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో దోహాలో రెండు రోజుల చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణపై కొంత సానుకూలంగా వ్యవహరించినట్లు తెలిపారు. మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త షరతులు విధించారని గాజా నుంచి పూర్తిగా బలగాల ఉపసంహరణను తిరస్కరించారని హమాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మధ్యవర్తుల ప్రయత్నాలను, ఒప్పందాన్ని అడ్డుకోవాలని ప్రధాని నెతన్యాహు చూస్తున్నారు. గాజాలో బంధీల జీవితాలకు పూర్తి బాధ్యత ఆయనదే’ అని హమాస్ ఆరోపించింది.
ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. 2.3 మిలియన్ ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. భీకరమైన ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహార ఇబ్బందులు, పోలీయో వంటి వ్యాధలు ప్రబలుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.