Gaza: గాజాలో ఇస్లామిక్‌ జిహాద్‌ అగ్రనేత హతం

Israeli airstrike kills senior Islamic Jihad commander in Gaza - Sakshi

గాజా సిటీ: ఇజ్రాయెల్‌–ఇస్లామిక్‌ జిహాద్‌ మధ్య ఘర్షణ నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ఇస్లామిక్‌ జిహాద్‌ ఉద్యమానికి అడ్డాగా మారిన గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు ఆదివారం మూడో రోజుకు చేరాయి. శుక్రవారం దాడులు మొదలైన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించడంతో తాజాగా ఇస్లామిక్‌ జిహాద్‌ ఉద్యమ అగ్రనేత ఖలీద్‌ మన్సూర్‌ హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు, ఐదుగురు సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత మూడు రోజుల్లో ఇజ్రాయెల్‌ ప్రకోపానికి బలైన వారి సంఖ్య 31కు చేరింది.

ఖలీద్‌ మన్సూర్‌ దక్షిణ గాజాలో రఫా శరణార్థుల శిబిరంలోని ఓ అపార్టుమెంట్‌పై నివసిస్తున్నాడు. అదే అపార్టుమెంట్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడికి దిగింది. మరోవైపు ఇరాన్‌ అండదండలు పుష్కలంగా ఉన్న ఇస్లామిక్‌ జిహాద్‌ సంస్థ కూడా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌ భూభాగంలోకి వందలాది రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌–ఇస్లామిక్‌ జిహాద్‌ నడుమ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, గాజాలో అధికారం చెలాయిస్తున్న ఉగ్రవాద సంస్థ హమాస్‌ మాత్రం ప్రస్తుతానికి మౌనం పాటిస్తోంది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top