
27 శాతంతో చైనాను దాటేశారు
వాషింగ్టన్: అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్యలో 2024లో 11.8 శాతం పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం అమెరికాలో 4,22,335 మంది భారత విద్యార్థులున్నట్టు యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) విడుదల చేసిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్ఈవీపీ) తాజా వార్షిక నివేదిక వెల్లడించింది.
అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఇది 27 శాతం. ఈ విషయంలో భారత్ గత 15 ఏళ్లలో తొలిసారిగా చైనా (20 శాతం)ను దాటేసి అగ్రస్థానంలో నిలవడం విశేషం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ మెటిక్స్ (స్టెమ్) కోర్సుల్లో అత్యధికంగా 48 శాతం మంది భారత విద్యార్థులే. 20.4 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. మొత్తంగా చైనా విద్యార్థుల సంఖ్య 2023తో పోలిస్తే 0.25 శాతం తగ్గడం విశేషం.
ఆసియా దేశాల హవా..
అమెరికాలో చదువుతున్న విదేశీయుల్లో ఆసియా దేశాల హవా కొనసాగుతోంది. మొత్తం 15.8 లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో 71.7 శాతం, అంటే 11,34,953 మంది ఆ దేశాలవారేనని నివేదిక తెలిపింది.