ఏడాదిలోపు సుదర్శన చక్రాలిచ్చేస్తాం | India to get remaining S-400 missile systems by 2026 | Sakshi
Sakshi News home page

ఏడాదిలోపు సుదర్శన చక్రాలిచ్చేస్తాం

Jun 3 2025 5:13 AM | Updated on Jun 3 2025 5:13 AM

India to get remaining S-400 missile systems by 2026

రష్యా ప్రకటన 

న్యూఢిల్లీ: కొత్తగా తయారుచేసి భారత్‌కు ఇవ్వాల్సిన ఎస్‌–400 గగనతల రక్షణ వ్యవస్థ(సుదర్శన చక్ర)లను 2025–2026 షెడ్యూల్‌ ప్రకారం అందజేస్తామని రష్యా స్పష్టంచేసింది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌పైకి భారత్‌ క్షిపణులను ప్రయోగించడం, ప్రతిగా అటు నుంచి దూసుకొచ్చిన క్షిపణులను భారత ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకోవడం తెల్సిందే. 

దీంతో ఒప్పందం ప్రకారం మిగతా ఎస్‌–400 యూనిట్లనూ త్వరగా తయారుచేసి సరఫరాచేయాలని భారత్‌ ఇటీవల రష్యాను కోరింది. దీనిపై రష్యా డెప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ ఇన్‌ ఇండియా రోమన్‌ బబూష్కిన్‌ సోమవారం స్పందించారు. ‘‘భారత్, పాక్‌ పరస్పర సైనిక చర్యల్లో ఎస్‌–400 అద్భుత పాటవాన్ని ప్రదర్శించిందని మేం కూడా విన్నాం. భారత్‌తో భాగస్వామ్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది.

 ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో యూరప్‌ మాత్రమేకాదు భారత్‌లోనూ రక్షణ సన్నద్ధత అత్యంత కీలకమైన అంశంగా మారింది. మరో రెండు యూనిట్లను భారత్‌కు అందించాల్సి ఉంది. వాటిని షెడ్యూల్‌ ప్రకారం తయారుచేసి డెలివరీ ఇస్తాం’’అని బబూష్కిన్‌ అన్నారు. 2018లోనే రష్యాతో భారత్‌ రూ.46,000 కోట్లతో ఎయిర్‌ డిఫెన్స్‌ డీల్‌ కుదుర్చుకోవడం తెల్సిందే. ఇందులోభాగంగా ఐదు స్క్వాడ్రాన్‌ల ఎస్‌–400 యూనిట్లను రష్యా తయారుచేసి భారత్‌కు ఇవ్వనుంది. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ మరికొద్ది వారాల్లో ఖరారుకానుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement