
ఖాట్మండ్: జెనరేషన్ జెడ్ ఆందోళనలతో అల్లకల్లోలంగా మారిన నేపాల్లో ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల్ కార్కీ బాధ్యతలు చేపట్టారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 12వ తేదీ) రాత్రి గం. 9 గంటల ప్రాంతంలో ఆమె నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత ఆ దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడేల్ ప్రమాణం చేయించారు.
సుశీల్ కార్కీకి ప్రధానిగా బాధ్యతలు అప్పగించాలని జెనరేషన్ జెడ్ నిరసనకారుల ఆందోళనకు మద్దతుగా ఆ దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడేల్, ఆర్మీ చీఫ్ ఆశోక్ రాజ్ సిగ్దేల్లు అంగీకరించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ను సైతం రద్దు చేశారు. ఈ నేపథ్యంలో సుశీల్ కర్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం ఖరారైంది.
సుశీలా కార్కీ ఎవరు?
సుశీలా కార్కీ 2016 జూలై నుండి 2017 జూన్ వరకు నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నేపాల్ చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన తొలి మహిళ. 1970లలో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించిన ఆమె.. 2009లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. తాజాగా, నేపాల్లో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
సుశీలా కార్కీ తన పదవీకాలంలో అవినీతిపై పోరాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆమె ఇచ్చిన ముఖ్యమైన తీర్పుల్లో.. మహిళలు తమ పిల్లలకు పౌరసత్వ హక్కులు ఇవ్వగలగడం. ఇది నేపాల్లో లింగ సమానత్వం దిశగా కీలక అడుగులు పడేలా చేసింది. ఈ తీర్పుతో సుశీలా కార్కీపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం కూడా వచ్చినప్పటికీ..ప్రజా వ్యతిరేకతతో అది వెనక్కి తీసుకున్నారు.
నేపాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఆ దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయిన సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానిగా నియమిస్తే బాగుంటుందని జెన్జీ భావించింది. నేపాల్ రాజకీయ సంక్షోభ సమయంలో పాలనను గాడినపెట్టడం,పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఆమె నాయకత్వం సరైందనే యోచనలో ఉంది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాతో.. దేశాన్ని నిష్పాక్షికంగా ముందుకు నడిపించగల నాయకురాలు ఆమెనేంటూ నేపాల్ పౌరులు ఆమెకు మద్దతు పలుకుతున్నారు.