న్యూఢిల్లీ: దేశంలోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో న్యూక్లియిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్టింగ్(ఎన్ఏటీ)ని తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. వైద్య శాస్త్రం తెలియకున్నా తెలిసినట్లుగా ఎందుకు తాము నటించాలని ప్రశ్నించింది. ఢిల్లీకి చెందిన ‘సర్వేశం మంగళం ఫౌండేషన్’వేసిన పిల్పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఎన్ఏటీ వల్ల గ్రహీతలకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేని రక్తాన్ని అందించేందుకు వీలవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం పిల్లకు విదేశీ నిధులు అందవని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించింది. ‘ఈ అంశంపై మాకు ఎటువంటి పరిజ్ఞానం లేదు, వైద్య శాస్త్రంతో ఎటువంటి పరిచయం లేకున్నా తెలిసినట్లుగా మేమెందుకు నటించాలి?అని ప్రశ్నించింది. బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీకి అవసరమైన ఏర్పాట్లు చేసే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్ను కోరింది.
రాష్ట్రాల కార్యదర్శులు సంబంధిత అంశాల్లో నిపుణుల సలహాలతో సరైన నిర్ణయం తీసుకుంటారంది. బ్లడ్ బ్యాంకుల్లో ఎటువంటి పరీక్షలు చేయాలన్నది నిపుణుల పరిధిలోనే ఉంటుందని తెలిపింది. ఈ అంశంలో ప్రత్యేకంగా తమకు ఎటువంటి పరిచయం లేనందున, పిటిషనర్ కోరిన విధంగా ఆదేశాలివ్వజాలమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకుల్లో ఖరీదైన ఎన్ఏటీకి ఏర్పాటు చేయడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పిటిషన్లో ఏముంది?
రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21లోని జీవించే హక్కులో భాగమే సురక్షితమైన రక్తాన్ని పొందే హక్కని పిటిషన్ తెలిపింది. బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీకి వెసులుబాటు కలి్పస్తే దాతల నుంచి సేకరించిన రక్తంలో హెచ్ఐవీ, హెపటైటిస్ సీ, బీ, మలేరియా, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వీలవుతుందని వివరించింది. రక్త దాతల నుంచి సేకరించిన రక్తం పూర్తి సురక్షితంగా గ్రహీతలకు అందేలా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొంది.
అయితే, ప్రభుత్వాల వైఫల్యాల వల్ల అత్యంత సున్నితమైన ఆరోగ్య పరిస్థితి కలిగిన, ముఖ్యంగా తలసీమియా రోగులను ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో విఫలమవుతున్నామని తెలిపింది. ఇన్ఫెక్షన్ కలిగిన రక్తాన్ని అందించడం వల్ల మధ్యప్రదేశ్లోని సత్నా ఆస్పత్రిలో ఆరుగురు తలసీమియా బాధిత చిన్నారులు హెచ్ఐవీ బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా, జార్ఖండ్లోని చైబాసా ఆస్పత్రిలో 2025లో ఐదుగురు బాలలు, యూపీలోని ఓ మెడికల్ కాలేజీలో 2023లో 14 మంది బాలలకు హెపటైటిస్, హెచ్ఐవీ సోకిందని తెలిపింది.


