సహారా ఎడారికి పోయినా.. బాస్ వదలడం లేదా?. మండుటెండలోనూ ఆఫీస్ మీటింగ్లు తప్పలేదా? అన్నట్టుగా ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ వ్యక్తి ఒంటెపై ప్రయాణిస్తూ, ల్యాప్టాప్ తెరిచి జూమ్ కాల్లో బిజీగా కనిపించిన దృశ్యం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది.
ఎడారి మధ్యలో అనంతమైన ఇసుక దిబ్బలపై ఒంటె హంప్పై ల్యాప్టాప్ పెట్టుకుని, జూమ్ కాల్లో పూర్తి ఫోకస్తో పని చేస్తున్నట్లుగా కనిపించిన ఆ వ్యక్తి దృశ్యం ఒక్కసారిగా వైరల్గా మారింది. ఆ వీడియోలో.. వీడు వీడి బాస్కు వర్క్ఫ్రమ్ హోం చేస్తున్నానని చెప్పాడు అని క్యాప్షన్ జోడించడంతో నవ్వులు పూస్తున్నాయి.
ఈ వీడియోను న్యూయార్క్కు చెందిన కంటెంట్ క్రియేటర్ షాద్ అక్తర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ అసాధారణ దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతూ.. రిమోట్ వర్క్ కల్చర్పై సరదా చర్చలకు దారితీసింది. కొందరు దీన్ని వర్క్ఫ్రమ్ ఎనీవేర్ ట్రెండ్కు పరాకాష్టగా అభివర్ణిస్తుండగా.. మరికొందరు ఆధునిక ఉద్యోగ జీవనశైలి ఎక్కడికైనా వెళ్లగలుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, ఈ వీడియోలో అందరినీ ఎక్కువగా ఆకర్షించిన విషయం.. “ఎడారి మధ్యలో కూడా జూమ్ కాల్ ఎలా సాధ్యం?” అనే కుతూహలం. “వైఫై ఎంత స్ట్రాంగ్!” అంటూ కొందరు సరదాగా కామెంట్ చేయగా, మరికొందరు ఇది టెక్నాలజీ సాధ్యాలను చూపించే ఉదాహరణగా పేర్కొన్నారు.
“వర్క్ ఫ్రమ్ హోం కాదు, వేర్ ఫీల్స్ హోం అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ వైరల్గా మారింది. మరోవైపు “ఇలాంటి జీవితం మాకూ కావాలి” అంటూ సరదా కోరికలు కూడా వ్యక్తమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న “work from anywhere” ట్రెండ్లో ఇది మరో వైరల్ ఎపిసోడ్గా నిలిచింది. ఇటీవల దక్షిణ కొరియాలో రోలర్కోస్టర్పై మీటింగ్లో పాల్గొన్న వీడియో తర్వాత.. మొన్నీమధ్యే మన హైదరాబాద్లో బండి పెట్రోల్ ట్యాంకర్ మీద ఓ వ్యక్తి ల్యాప్ట్యాప్తో చేసిన ప్రయాణం.. ఇప్పుడు ఎడారిలో ఒంటెపై Zoom కాల్ వీడియో కూడా అదే జాబితాలో చేరింది.


