
వార్సా: పోలండ్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీకి చెందిన కరోల్ నవ్రొకి(42) ఎన్నికయ్యారు. అత్యంత ఉత్కంఠగా సాగిన పోరులో నౌరొకికి 50.89% శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి, వార్సా మేయర్ రఫాల్ ట్రస్ కోవ్స్కీకి 49.11% ఓట్లు పోలయ్యాయి. రెండు వారాల క్రితం జరిగిన మొదటి రౌండ్ ఓటింగ్ సమయంలో ఈయూ, నాటో అనుకూల పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలు తేటతెల్ల మయ్యాయి.
ఆదివారం సాయంత్రం ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో రఫాల్ ట్రస్కోవ్స్కీ ముందంజలో ఉన్నారు. కేవలం రెండు గంటల్లోనే ఫలితం తారుమారవడం గమనార్హం. ఓటమిని అంగీకరించిన ట్రస్కోవ్స్కీ సోమవారం నవ్రొకికి అభినందనలు తెలిపారు. మాజీ బాక్సర్, చరిత్రకారుడు, అయిన నవ్రొకికి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. నవ్రొకికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించడం విశేషం. ఆయనకే గెలుపు అవకాశాలున్నాయని కూడా వ్యాఖ్యానించారు. నవ్రొకి ఎన్నికల కార్యక్రమాల్లో అమెరికా జెండాలు సైతం కనిపించడం గమనార్హం. వైట్హౌస్కు రావా లంటూ నెల క్రితమే నవ్రొకిని ట్రంప్ ఆహ్వానించారు.