రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన రష్యన్ కళాకారుడు, కార్టూనిస్ట్ రాబర్ట్ కుజోవ్కోవ్ పోలాండ్లో దారుణ హత్యకు గురయ్యాడు. తూర్పు పోలాండ్లోని బియాలా పోలాస్కా పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని తుపాకులతో కాల్చిచంపారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు ఇద్దరు బెలారస్ పౌరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
2021లో రాజకీయ వేధింపుల భయంతో రష్యా విడిచి వచ్చిన కుజోవ్కోవ్కు పోలాండ్ ఆశ్రయం కల్పించింది. "సెమ్యోన్ స్క్రెపెట్స్కీ" పేరుతో ఆయన రూపొందించిన వ్యంగ్య చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. పుతిన్తో పాటు చెచెన్యా నాయకుడు రంజాన్ క్యాడీరోవ్, అలెంగ్జాండర్ లుకాషెంకో వంటి నేతలను లక్ష్యంగా చేసుకుని ఘాటు కార్టూన్లు గీసేవాడు.
ఇటీవల బెర్లిన్లో జరిగిన "రష్యా డే" నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొన్న ఆయన.. పుతిన్, జోసఫ్ స్టాలిన్లను వ్యంగ్యంగా చిత్రీకరించిన పెయింటింగ్తో నిరసన తెలిపాడు. మరణానికి ముందు రోజు కూడా ఆయన సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నట్లు సమాచారం. కుజోవ్కోవ్ సన్నిహితులు ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


