
కెనడాలోని వాంకోవర్ సిటీలో ఘటన
దుండగుల్లా వ్యవహరించారన్న కెనడా పాత్రికేయుడు
వాంకోవర్: కెనడా గడ్డపై తరచూ భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాదులు తాజాగా కెనడియన్ జర్నలిస్ట్ను బెదిరించారు. ర్యాలీని తన కెమెరాలో రికార్డ్ చేస్తున్నందుకు జర్నలిస్ట్ మోకా బెజిర్గన్ను కొట్టినంత పనిచేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన తాలూకూ వివరాలను మోకా తర్వాత వెల్లడించారు. ఉద్యమకారులంతా దుండగుల్లా వ్యవహరించారని, ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని మోకా చెప్పారు.
‘‘ ఈ ఘటన జరిగిన రెండు గంటలవుతున్నా నా శరీరం ఇంకా వణికిపోతోంది. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు. నన్ను చుట్టుముట్టి బెదిరించారు. నా ఫోన్ బలవంతంగా లాక్కున్నారు. గతంలో ఖలిస్తానీ ఉద్యమాలపై సొంతంగా రిపోర్టింగ్ చేసినందుకు నాపై కక్షగట్టారు. ఖలిస్తానీవేర్పాటువాదులపై నేను తటస్థ వైఖరిని ప్రదర్శించడం వాళ్లకు నచ్చలేదనుకుంటా. అందుకే నన్ను కొట్టినంత పనిచేశారు. కెనడా, బ్రిటన్, అమెరికా, న్యూజిలాండ్లలో ఖలిస్తానీయుల వైఖరిని నా రిపోర్టింగ్ ద్వారా ప్రపంచానికి తెలియజేశా.
అందుకే గతంలో వీళ్లు నన్ను ఆన్లైన్లో ఇష్టమొచ్చిన పదజాలంతో తిట్టారు. ఆదివారం వాంకోవర్లో వాళ్ల ర్యాలీని నేను కెమెరాలో రికార్డ్చేస్తుంటే అడ్డుకున్నారు. టచ్ చేస్తే ఊరుకునేది లేదని బెదిరించారు. నా పనికి అడ్డురావొద్దని వారించినా వాళ్లు వినిపించుకోలేదు. పదేపదే నా వెనకాల పడ్డారు. ముఖ్యంలో వారిలో ఒకడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. అందుకే అతనిపై పోలీసులకు ఫిర్యాదుచేశా. గతంలోనూ అతనిపై ఫిర్యాదుచేశా’’ అని జర్నలిస్ట్ మోకా తర్వాత ఒక వీడియోను విడుదలచేశారు. కెనడాలో ఖలిస్తానీవేర్పాటువాదుల ఆగడాలు ఎక్కువయ్యాయని అక్కడి అధికార యంత్రాంగానికి భారత ప్రభుత్వం పలుమార్లు ఫిర్యాదుచేసినా కెనడా సర్కార్లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. దీంతో ఖలిస్తానీ సానుభూతిపరులకు కెనడా స్వర్గధామంగా తయారైంది.