అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రతీరంలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయిన ఇద్దరు భారత సంతతి కళాశాల విద్యార్థినులు భారీ అలలకు చిక్కి సముద్రంలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరు ఘటన జరిగిన రోజే మృతి చెందగా, మరో యువతి కొన్ని రోజులపాటు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జూన్ 10న కాలిఫోర్నియాలోని బోనీ డూన్ బీచ్లో ఈ ప్రమాదం జరిగింది. ఫ్రీమాంట్కు చెందిన 21 ఏళ్ల హర్షిత నాయర్, 20 ఏళ్ల మహియాల్ శ్రాన్ సముద్రతీరంలోని ప్రమాదకర ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటుండగా, భారీ అలలు వారిని సముద్రంలోకి లాగేశాయి.
సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది, రక్షక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టాయి. సుమారు ఎనిమిది మంది రెస్క్యూ స్విమ్మర్లు ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దిగి ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు.
హర్షిత ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మరణించగా.. తీవ్రంగా గాయపడిన మహియాల్ కొన్ని రోజులు మృత్యుతో పోరాడి, చివరికి ప్రాణాలు కోల్పోయింది.
హర్షిత, మహియాల్ 2023లో వాషింగ్టన్ హైస్కూల్లో చదువు పూర్తి చేశారు. హర్షిత యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్కిలీలో లీగల్ స్టడీస్ చదువుతుండగా, మహియాల్ సాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీలో పబ్లిక్ హెల్త్ విద్యను అభ్యసిస్తోంది. ఇద్దరూ 2027లో పట్టభద్రులయ్యే అవకాశం ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది.


