
భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla)అంతరిక్షంలోకి బయల్దేరారు. ఆయన ఈ మిషన్కు పైలట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నాం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ నలుగురు వ్యోమగాములతో బయల్దేరింది. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుక్లా నేతృత్వంలోని బృందం చేరుకోనుంది
యాక్సియం-4 మిషన్లో భాగంగా.. రాకెట్ ఒక్కో దశను విజయవంతంగా దాటుకుంటూ ముందుకు సాగింది. ‘మేం భూకక్ష్యలో తిరుగుతున్నాం.. భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. జైహింద్.. జైభారత్’ అంటూ శుభాంశు సందేశం బయటకు వచ్చింది. అంతకు ముందు.. ఆయన మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కేవలం పరికరాలను మాత్రమే వెంట తీసుకెళ్లడం లేదని, వంద కోట్ల మందికిపైగా ఆశలను మోసుకెళ్తున్నానని అన్నారు. భారత కాలమానం ప్రకారం.. రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో.. ఐఎస్ఎస్ అనుసంధానం కోసం డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే.. కోట్లాది మంది ఈ ప్రయోగాన్ని లైవ్లో వీక్షించారు. సుమారు 41 ఏళ్లకు.. భారత వ్యోమగామి రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుక్లాకు ఘనత సాధించారు. ఈ అరుదైన క్షణాలను శుక్లా తల్లిదండ్రులు వీక్షించారు. తాము ఎంతో సంతోషంగా ఉన్నామని.. ఏ మాత్రం భయపడటం లేదని ఈ చారిత్రక ఘట్టంపై శుక్లా తల్లి ఆశా స్పందించారు. తమ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. అనంతరం.. బంధువులను ఆలింగనం చేసుకుని ఆమె ఆనందంతో చిందులు వేశారు.
#WATCH | Lucknow, Uttar Pradesh: Parents, relatives of IAF Group Captain & astronaut Shubhanshu Shukla, celebrate as #Axiom4Mission lifts off from NASA's Kennedy Space Centre in Florida, US.
The mission is being piloted by India's IAF Group Captain Shubhanshu Shukla. pic.twitter.com/JmbodqjyEy— ANI (@ANI) June 25, 2025

ప్రయాణానికి ముందు శుక్లా ఇలా..
రోదసీ యాత్రకు ముందు.. శుభాంశు శుక్లా తనకు ఇష్టమైన పాటలు విన్నారు. హృతిక్ రోషన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘ఫైటర్’లోని వందేమాతరం ఆయన రిపీట్ మోడ్లో విన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా.. ఇలాంటి ప్రయోగాలకు ముందు వ్యోమగాములకు సంగీతం వినేందుకు అనుమతిస్తారు. తద్వారా మానసిక స్థితి బాగుంటుందనేది పరిశోధకుల సూచన. అందుకే ఇలాంటి సౌకర్యం కల్పిస్తారు.
బ్యాకప్ పైలట్ బాలకృష్ణన్ ప్రశంసలు..
యాక్సియం-4 మిషన్కు పైలట్గా వ్యవహరించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాపై కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ప్రశంసలు గుప్పించారు. ఈ మిషన్కు బ్యాకప్ పైలట్గా ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ వ్యవహరించారు. శుక్లాలో ఆత్మవిశ్వాసం, నిబద్ధత మెండుగా ఉన్నాయని.. యాక్సియం-4 మిషన్పై పూర్తి ఫోకస్ ఉందని నాయర్ వ్యాఖ్యనించారు.
యాక్సియం-4 స్పేస్ మిషన్ మే చివరి వారంలో జరగాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి ఏడుసార్లు రకరకాల కారణాలతో ఈ ప్రయోగం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు.. ఇవాళ ప్రయోగం విజయవంతంగా జరిగింది.
శుభాంశు శుక్లా భారత వైమానిక దళానికి చెందిన అధికారి. ఆయన ప్రస్తుతం యాక్సియం-4 మిషన్లో మిషన్ పైలట్గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రయాణిస్తున్నారు. ఇది భారతదేశం తరఫున ISSకి వెళ్తున్న తొలి మిషన్ కావడం విశేషం.

శుభాంశు శుక్లా గురించి:
పుట్టిన తేది: 1985 అక్టోబర్ 10
వయస్సు: సుమారు 39 సంవత్సరాలు
వృత్తి: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్
స్థలం: లక్నో, ఉత్తరప్రదేశ్
కుటుంబం: తండ్రి శంభు దయాల్ శుక్లా, అక్క శుచి శుక్లా
భార్య: కామ్నా (డెంటిస్ట్)
కొడుకు: కియాష్ (6 ఏళ్లు)
1999లో కార్గిల్ యుద్ధం ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది. 14 ఏళ్ల వయసులో ఎయిర్ షో చూసి ప్రేరణ పొందిన ఆయన, ఎన్డీఏ పరీక్ష రాసి కుటుంబానికి చెప్పకుండా ఎంపికయ్యారు.
శుక్లా వృత్తిపరమైన జీవితం
విద్య: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ – నేషనల్ డిఫెన్స్ అకాడమీ (2005)
ఎంటెక్ – ఏరోస్పేస్ ఇంజినీరింగ్, IISc బెంగళూరు
వైమానిక దళంలో చేరిక: 2006లో ఫైటర్ పైలట్గా
విమానాలు నడిపిన అనుభవం: సుఖోయ్-30 MKI, మిగ్-29, మిగ్-21, జాగ్వార్, హాక్ తదితర యుద్ధ విమానాలు
ఫ్లయింగ్ అవర్స్: 2000 గంటలకు పైగా
ప్రత్యేక ఘట్టం: 2019 బాలాకోట్ వైమానిక దాడుల్లో పాల్గొన్నారు
వ్యోమగామిగా ఎంపిక: 2019లో ISRO గగన్యాన్ మిషన్ కోసం
శిక్షణ: రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రం, అనంతరం బెంగళూరులో
ప్రస్తుత మిషన్: యాక్సియం-4 పైలట్గా ISSకి ప్రయాణం, 7 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహణ
మిషన్లో భాగంగా..
యాక్సియం-4 మిషన్ (Axiom-4 Mission) ఉద్దేశం చాలా విస్తృతమైనది. NASA, ISRO, ESA, SpaceX భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ అంతరిక్ష యాత్ర. అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ మిషన్లో భాగంగా, వివిధ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రయాణించి శాస్త్రీయ పరిశోధనలు చేస్తారు. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈ మిషన్లో మిషన్ పైలట్గా ఉన్నారు. ఆయనతో పాటు అమెరికా, హంగేరీ, పోలాండ్కు చెందిన వ్యోమగాములు కూడా పాల్గొంటున్నారు.

మిగతా ముగ్గురు వ్యోమగాములు వీరే..
- పెగ్గీ విట్సన్ (Peggy Whitson) – మిషన్ కమాండర్, అమెరికా. NASAకి చెందిన మాజీ వ్యోమగామి, అమెరికాలో అత్యధికంగా అంతరిక్షంలో గడిపిన వ్యక్తి (675 రోజులు).
- స్లావోష్ ఉజ్నాన్స్కీ (Sławosz Uznański) – మిషన్ స్పెషలిస్ట్, పోలాండ్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)కి చెందిన శాస్త్రవేత్త.
- టిబోర్ కాపు (Tibor Kapu) – మిషన్ స్పెషలిస్ట్, హంగేరీ. హంగేరీ ప్రభుత్వ HUNOR ప్రోగ్రామ్ ద్వారా ఎంపికయ్యారు.
మిషన్ ముఖ్య ఉద్దేశాలు:
యాక్సియం 4 స్పేస్ మిషన్లో భాగంగా 28 గంటలపాటు ప్రయాణించి ఈ బృందం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం(ISS) చేరుకుంటుంది. అక్కడ 14 రోజుల పాటు ఉండి 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తుంది ఈ నలుగురు వ్యోమగాముల బృందం. ఇందులో శుభాంశు శుక్లా స్వయంగా 7 కీలక ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఇవి జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించినవి. పైగా ఇది భారతదేశం కోసం గగన్యాన్ మిషన్కు ముందడుగుగా పరిగణించబడుతోంది. అలాగే.. అంతర్జాతీయ సహకారంతో భారత అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యత పెంచడం కూడా ఈ మిషన్ లక్ష్యాల్లో ఒకటి. పైగా 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారి కావడం వల్ల, ఇది చారిత్రక ఘట్టంగా మారింది.
బడ్జెట్ ఎంతంటే..
భారత ప్రభుత్వం తరఫున Department of Space (DoS) ఈ మిషన్ కోసం రూ. 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి రూ. 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన రూ. 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు. ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, మరియు అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. ఇది భారతదేశం తరఫున ISSకి వెళ్లే తొలి మిషన్ కావడమే కాదు.. గగన్యాన్ మిషన్కు ముందడుగుగా పరిగణించబడుతోంది.