వాషింగ్టన్: భారత్ తాజాగా అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. సీఏఏ అమలు తీరును తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయమై గురువారం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు.
‘మార్చ్ 11 సీఏఏ నోటిఫికేషన్పై మేం ఆందోళనతో ఉన్నాం. ఈ చట్టం అమలు తీరును గమనిస్తున్నాం. మత పరమైన స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించడం అనేవి ప్రజాస్వామ్య మూల సూత్రాలు’ అని మిల్లర్ పేర్కొన్నారు. అయితే హిందూ అమెరికన్లు మాత్రం సీఏఏను స్వాగతిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి డిసెంబర్ 31, 2014కు ముందు వలస వచ్చిన నాన్ ముస్లింలకు సీఏఏ ప్రకారం భారత పౌరసత్వం ఇస్తున్నారు. కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చాలు వలసవచ్చిన వారికి పౌరసత్వం జారీ చేస్తున్నారు. ఈ చట్టం కింద దేశంలోని ఒక్క ముస్లిం కూడా తమ పౌరసత్వాన్ని కోల్పోడని భారత ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దేశంలో అన్ని మతాలు సమానమేనని స్పష్టం చేసింది.