
15 మంది దుర్మరణం..
156 మందికి గాయాలు
కీవ్: నెలల తరబడి ఉక్రెయిన్పై దాడులు చేస్తున్న రష్యా సోమవారం రాత్రివేళ ముప్పేట దాడికి దిగింది. డ్రోన్లు, క్షిపణులతో దాడులను ఉధృతంచేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్పై కన్నెర్రజేసింది. రాత్రంగా పలుచోట్ల జరిగిన క్షిపణి దాడుల్లో 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని కీవ్ నగర సైనిక పరిపాలన అధిపతి తైమూర్ త్కచెన్కో మంగళవారం ప్రకటించారు. ఈ దాడుల్లో 156 మంది గాయపడ్డారు. క్షిపణి దాడుల ధాటికి 9 అంతస్తుల భవనం ఒకటి నేలమట్టమైంది. మరికొన్ని అపార్ట్మెంట్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.
ఉక్రెయిన్ రాజధానిపై ఇటీవలికాలంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటని తైమూర్ పేర్కొన్నారు. యుద్ధం మొదలై మూడు సంవత్సరాలు గడిచినా, రెండుసార్లు ప్రత్యక్ష చర్చలు జరిగినా ఈ రణం రవ్వంతైనా సానుకూల, శాంతిపథం దిశగా సాగట్లేదని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. కేవలం సైనికుల పరస్పర మార్పిడి, బందీల విడుదల వంటి కంటితుడుపు చర్చలు తప్పితే కీలకమైన కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు పడట్లేదు. తీరప్రాంత నగరం ఒడెసాపైనా రష్యా డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడిలో ఒకరు చనిపోయారు. 17 మంది గా యపడ్డారు. సోమవారం రాత్రి రష్యా ఏకంగా 440 డ్రోన్లు, 32 మిస్సైళ్లను కీవ్పై ప్రయోగించిందని జెలెన్స్కీ చెప్పారు.