సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది పునరుజ్జీవం పనులకు ప్రభుత్వం మూడేళ్లలో ప్రతి బడ్జెట్లో రూ.1,500 కోట్ల చొప్పున రూ.4,500 కోట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు రూ.392 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ సుందరీకరణలో ఫేజ్–1 అభివృద్ధి పనులకు రూ.5,812.4 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. 2024–25 రాష్ట్ర బడ్జెట్లో మూసీ ప్రాజెక్ట్కు ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించగా.. కేవలం రూ.11.25 కోట్లు, 2025–26 బడ్జెట్లో రూ.1,500 కోట్లకు.. రూ.6.21 కోట్ల నిధులను మాత్రమే వినియోగించారు. 2026–27 బడ్జెట్లో రూ.1,500 కోట్లను కేటాయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ.375 కోట్లను విడుదల చేశారు.
భూ సేకరణ ముమ్మరం..
ఫేజ్–1లో 21 కి.మీ. మేర మూసీ సుందరీకరణ చేపటనున్నారు. హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ., ఉస్మాన్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ. ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. దీంతో ఆయా మార్గాల లో భూ సేకరణ కార్యకలాపాలను ఎంఆర్డీసీఎల్ అధికారులు ముమ్మరం చేశారు. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, గాంధీ సరోవర్ ప్రాంతాలలో బఫర్ జోన్లలోని పలువురు భూ యజమానులకు, సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
● ఇప్పటికే గండిపేట మండలంలోని హిమాయత్సాగర్, కిస్మత్పూర్, రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతిపేట, బుద్వేల్, శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్), తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రయినింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (వాలంతరీ), ఎస్సీ/ఎస్టీ స్టడీ సర్కిల్ వంటి సంస్థలకు గతంలో కేటాయించిన సుమారు 734 ఎకరాల భూములను మూసీ ప్రాజెక్ట్కు బదిలీ చేశారు. కాగా.. మూసీ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) ఇంకా పూర్తి కాలేదు. అందుకే నిధుల కేటాయింపులు, వినియోగం ఆశించిన స్థాయి లో లేదని ఎంఆర్డీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
పునరుజ్జీవానికి అరకొర కేటాయింపులు
తొలి దశ పనుల అంచనా రూ.5,812 కోట్లు
ఇప్పటికి విడుదలైంది రూ.392 కోట్లే


