సీఎం మెప్పు పొందేదెవరో? | - | Sakshi
Sakshi News home page

సీఎం మెప్పు పొందేదెవరో?

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

వచ్చే నెలతో ముగియనున్న నిమ్స్‌ డైరెక్టర్‌ పదవీకాలం

భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌

ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం

సాక్షి, సిటీబ్యూరో: వైద్యరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే నిమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ పదవికి త్వరలోనే నోటిఫికేషన్‌ రాబోతోంది. 2023 జూన్‌లో నిమ్స్‌ డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన నగరి బీరప్ప మూడేళ్ల పదవీకాలం మరో నెలరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ పదవి కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా నిమ్స్‌లోని ముగ్గురు సీనియర్‌ వైద్యుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో కొన్ని కీలక విభాగాల అధిపతులు కూడా డైరెక్టర్‌ పోస్టు రేసులో ఉన్నామంటున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు సైతం మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వైద్యం, పరిపాలనాపరంగా అనుభవం ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆ గౌరవం లభిస్తుంది. నిమ్స్‌ పాలక మండలి అధ్యక్షుడిగా వ్యవహరించే సీఎం ఆదేశాల మేరకే డైరెక్టర్‌ నియామకం ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా?

నిమ్స్‌ డైరెక్టర్‌ పదవీ కాలం ముగిసే సమయానికి ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో సీనియర్‌ వైద్య నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ముగ్గురు ఉంటారు. డైరెక్టర్‌ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. దరఖాస్తుదారులు కనీసం 25 ఏళ్లు వృత్తిపరమైన అనుభవం, పదేళ్లకుపైగా టీచింగ్‌, రీసెర్చ్‌ రంగాల్లో పనిచేసి, పరిపాలనా అనుభవం ఉండాలి. దరఖాస్తులను సెర్చ్‌ కమిటీ పరిశీలించి, ప్రతిభావంతులైనవారిలో మూడు నుంచి ఐదు మంది పేర్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది. అందులో ఒకరిని సీఎం డైరెక్టర్‌గా ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో విడులవుతుంది. ఎంపికై న వ్యక్తి మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు.

Advertisement
 
Advertisement
Advertisement