● షాహినాయత్ గంజ్లో భారీ చోరీ
● 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదుతో పరార్
అబిడ్స్: షాహినాయత్గంజ్ ముల్తానిపురాలో భారీ చోరీ చోటుచేసుకుంది. గోషామహాల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ కథనం ప్రకారం... ముల్తానిపురాకు చెందిన మహేశ్ బేగంబజార్లోని స్టీల్ దుకాణంలో సేల్స్మేన్. లంగర్హౌస్లో బంధువుల పెళ్లి ఉండటంతో 4, 5 రోజులుగా ఉదయం కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లి అర్ధరాత్రి తిరిగి వస్తున్నారు. ఆదివారం వెళ్లి వచ్చేసరికి ఇంటి ద్వారం తెరిచి ఉంది. లోపల బీరువా పగలగొట్టి ఉంది. అందులోని 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదు, ఇతర సామగ్రి కనిపించలేదు. మహేష్ వెంటనే గోషామహాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ సంఘటనాస్థలానికి వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. 2వ అంతస్తులో తమ్ముడి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నప్పటికీ ఏ వస్తువు కూడా చోరీ కాలేదు. గ్రౌండ్ఫ్లోర్లోని స్టోర్రూమ్ కానీ, ఫస్ట్ ఫ్లోర్లో తల్లి నివాసం వైపుకానీ కన్నెత్తి చూడలేదు. తెలిసిన వ్యక్తులే రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు రూ.50 లక్షల సొత్తు చోరీ అయిందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


