పంజగుట్ట: తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి సోమవారం సచివాలయంలో మంత్రి దామోదర్ రాజ నరసింహకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా జూన్ 1 నుంచి నిమ్స్లో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఈ స్పెషల్ డ్రైవ్లో మాస్టర్ హెల్త్ చెకప్ ఉచితంగానే చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు నిమ్స్లో అవసరమైన ఏర్పాటు చేయాలని దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యదర్శి క్రిస్టినాను ఆదేశించారు.
శంషాబాద్ తహసీల్లో రోజంతా ఏసీబీ పరిశీలన
శంషాబాద్: శంషాబాద్ తహసీల్ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ పరిశీలన కొనసాగింది. ఉదయం 10.30కు వచ్చిన ఏసీబీ అధికారులు తహసీల్దార్తో పాటు కార్యాలయంలో ఉన్న అందరు అధికారులతో మరోసారి రికార్డుల పరిశీలన చేపట్టారు. శుక్రవారం గైర్హాజరైన కొందరు అధికారులు సోమవారం విధులకు రాగా... వారి రికార్డులను కూడా తనిఖీ చేశారు. ఇద్దరు ఉద్యోగులు ఆకస్మికంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లినట్లు సమాచారం. రికార్డుల పరిశీలనతో పాటు వివిధ అంశాలపై ఏసీబీతో చర్చించేందుకు రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్రెడ్డి రోజంతా తహసీల్దార్ కార్యాలయంలోనే ఉండడం గమనార్హం.


