నలుగురికి గాయాలు.. పగిలిన ఇళ్ల అద్దాలు,
పహాడీషరీఫ్: రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఆక్సిజన్ సిలిండర్ల గోదాంలో పేలుడు సంభవించింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి వివరాల ప్రకారం.. జల్పల్లి బాబాకాంట సమీపంలో అబ్దుల్ కరీం, అబ్దుల్ గౌస్, షేక్ మహ్మద్ రిజ్వాన్ అహ్మద్లు లైఫ్ కేర్ మెడికల్, ఇండస్ట్రియల్ ఎయిర్ ప్రొడక్ట్స్ పేరుతో ఆక్సిజన్ సిలిండర్ల గోదాం నిర్వహిస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా కర్నూలు, పటాన్చెరు నుంచి భారీ కంటైనర్లను తీసుకువచ్చి, చిన్న కంటైనర్లు, అందులోంచి సిలిండర్లలోకి నింపి ఆస్పత్రులు, పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ కంటైనర్ నుంచి గ్యాస్ లీకై , భారీ శబ్దంతో పేలింది. ఈ ప్రభావంతో మరో కంటైనర్ నుంచి వాయువు విరజిమ్మింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ప్రహరీ కూలి డీసీఎం, పది బైక్లు ధ్వంసమయ్యాయి. గోదాం కప్పు దెబ్బతిన్నది. ఇళ్ల కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. కంపెనీ ఆపరేటర్ బృందావన్ దాస్, పక్క షెడ్లోని కార్మికులు తౌఫిక్, సయ్యద్ ఖలీం గాయపడ్డారు. వీరిని మైలార్దేవ్పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


