ప్రేమ పేరుతో నయవంచన | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో నయవంచన

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

సంపన్న యువతులే లక్ష్యంగా మోసాలు

పోక్సో నిందితుడిని స్వయంగా విచారించిన సీపీ

బంజారాహిల్స్‌: సంపన్న యువతులే లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి వ్యాపారం పేరిట లక్షల రూపాయలు వసూలు చేసిన చీటర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు నాలుగు రోజుల కస్టడీ నిమిత్తం తీసుకువచ్చారు. సోమవారం నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనర్‌ స్వయంగా నిందితుడిని విచారణ చేశారు. కూకట్‌పల్లిలో నివసిస్తూ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లో పని చేస్తున్న కొడూరి చంద్రశేఖర్‌ ఆజాద్‌ అలియాస్‌ అర్జున్‌ (22) ఇన్‌స్ట్రాగామ్‌లో ఖరీదైన కార్లలో తిరుగుతున్నట్లు క్లబ్‌లు, పబ్‌ల్లో మద్యం తాగుతున్నట్లు ఫొటోలు పెడుతూ యువతులను ఆకర్షించేవాడు. ఈ క్రమంలో వెంకటగిరికి చెందిన ఓ బాలిక చంద్రశేఖర్‌ ఉచ్చులో పడింది. స్టార్టప్‌ పేరుతో ఆమె నుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మాయ మాటలతో యువతులను ఆకర్షిస్తూ చాలా మందిని మోసం చేసినట్లుగా విచారణలో తేలడంతో సోమవారం స్వయంగా సీపీ సజ్జనార్‌ ఇక్కడికి విచ్చేసి నిందితుడితో మాట్లాడారు. ఎంత మందిని మోసం చేసిన విషయాన్ని కూడా ఆరా తీశారు. సుమారు గంట పాటు సీపీ సజ్జనార్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసుపై దృష్టిసారించారు. కస్టడీ అనంతరం నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చంద్రశేఖర్‌ తల్లి మీనాకుమారితో పాటు మేన మామను కూడా జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement