చెత్త ఏరుకునేవారిలాగ వచ్చి.. చీరల చోరీ
బంజారాహిల్స్: చెత్త సేకరించే మహిళలు లాగా భుజాలపై సంచులు వేసుకుని వచ్చిన నలుగురు మహిళలు ఓ చీరల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జహ్నుమా నవాబ్సాబ్ కుంటకు చెందిన ఎండీ సాదిక్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లో చీరల దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు మహిళలు భుజాలపై చెత్తను ఏరుకునే సంచులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఈ చీరల దుకాణం వద్దకు వచ్చి చెత్త ఏరుతున్నట్లు నటిస్తూ షోరూం తాళాలు పగులగొట్టారు. లోనికి వెళ్లి రూ.2 లక్షల ఖరీదైన చీరలను మూటగట్టుకుని మెల్లగా జారుకున్నారు. సోమవారం ఉదయం షాపు తెరవడానికి వచ్చిన సాదిక్ తాళాలు పగులగొట్టి ఉండడం గమనించాడు. లోపల దుస్తులన్నీ చిందరవందరగా పడి ఉండడం అనుమానం వచ్చింది. చాలామంది చీరలను వర్క్ పనుల కోసం ఆయనకు ఇస్తుంటారు. వాటిని కూడా చోరీ చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థానికి చేరుకుని ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించగా నలుగురు మహిళలు ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు తేలింది. వీరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నరు.


