దక్షిణమధ్య రైల్వే జీఎం
సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
సాక్షి, సిటీబ్యూరో: వేసవి డిమాండ్ దృష్ట్యా రైళ్ల నిర్వహణ, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సదుపాయాలు, భద్రతపై దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమావేశం నిర్వహించారు. అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వడగాలుల దృష్ట్యా రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టవలసిన చర్యలపై జీఎం దిశానిర్దేశం చేశారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ట్రాక్లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, అవసరమైన మేరకు ట్రాక్లను కంకరతో నింపాలని సూచించారు. వేడి వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు వేసవి జాగ్రత్తల ప్రాముఖ్యతపై ట్రాక్ పెట్రోల్ సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. రైళ్లలో ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా నివారించడానికి నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా డ్రైవ్ను సమీక్షించారు. ప్రైవేట్ సైడింగ్లు, గూడ్స్ షెడ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ ప్రవేశాలకు ఆవకాశం ఉన్న కొన్ని ప్రదేశాలలో ట్రాక్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలన్నారు.


