సూరీడి కర్ఫ్యూ
సూరీడి ప్రతాపంతో నగరం ఉడుకుతోంది.. ప్రజలు బయటకు రావాలంటేనే వణికే పరిస్థితి నెలకొంది. ఎలాంటి సమయంలోనైనా నిత్యం రద్దీగా కనిపించే రహదారులు సైతం బోసిపోతున్నాయి. గురువారం చార్మినార్ వద్ద కనిపించిన దృశ్యమిది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గన్ఫౌండ్రీ: ప్రముఖ మృదంగ విద్వాంసుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎల్లా వెంకటేశ్వరరావు అరుదైన, అద్భుతమైన కళాకారుడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సోమశేఖర మ్యూజిక్ డాన్స్ కల్చరల్ సొసైటీ, కిన్నెర ఆర్ట్ థియేటర్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ఎల్లా వెంకటేశ్వరరావుకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన భట్టి మాట్లాడుతూ..కర్ణాటక సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న గొప్ప కళాకారుడు వెంకటేశ్వరరావు అని కొనియాడారు. 36 గంటల పాటు మృదంగం వాయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారని గుర్తు చేశారు. 83 సంవత్సరాల వయసులోనూ తన మృదంగంతో ప్రేక్షకులను కనువిందు చేయడం ప్రశంసనీయమన్నారు. అంతకు ముందు చిన్నారుల సినీ గీతాలాపన ఆహూతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సంగీత దర్శకుడు విశ్వనాథ్, ఏపీ సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పెంచలయ్య, కిన్నెర కార్యదర్శి రఘురాం, బాలమురళి తదితరులు పాల్గొన్నారు.


