కల్తీ టీ పౌడర్‌ గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

కల్తీ టీ పౌడర్‌ గుట్టురట్టు

Apr 24 2026 8:08 AM | Updated on Apr 24 2026 8:08 AM

నగరవ్యాప్తంగాహెచ్‌–ఫాస్ట్‌ బృందాల దాడులు

గన్‌ ఫౌండ్రి: నగరంలో మరో భారీ కల్తీ టీ ఫౌడర్‌ దందా వెలుగు చూసింది. గురువారం హెచ్‌–ఫాస్ట్‌ బృందాలు ఏకకాలంలో నగరవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేసి సుమారు 3 వేల కిలోల కల్తీ టీ పొడి, 1,500 కిలోల గడువు ముగిసిన టీ పొడి, వంద కిలోల బెల్లంతోపాటు కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకున్నాయి. పదిమంది నిందితులను అరెస్ట్‌ చేశాయి. ఈ సందర్భంగా పాత బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైభవ్‌ రఘునాథ్‌ గైక్వాడ్‌ వివరాలు వెల్లడించారు. కొంపల్లికి చెందిన పరీష్‌ రాజన్‌, పేట్లబురుజుకు చెందిన సంజు అలియాస్‌ పతి, ముషీరాబాద్‌కు చెందిన సతీష్‌, బోయిన్‌పల్లికి చెందిన నవీన్‌, ఆసిఫ్‌నగర్‌కు చెందిన నరసింహ, రాజేంద్రనగర్‌కు చెందిన చున్నీలాల్‌ చౌదరి, బోరబండకు చెందిన నరసింహులు, బీదర్‌కు చెందిన రవీందర్‌, మల్లేపల్లికి చెందిన వసీం ముఠాగా ఏర్పడ్డారు. వీరు కోల్‌కతా, అస్సాం, కేరళ నుంచి నాసిరకం, వాడిన, గడువు తీరిన టీ పౌడర్లను సేకరిస్తున్నారు. వీటికి బెల్లంపాకంతోపాటు కొన్ని రసాయనాలను కలిపి బ్రాండెడ్‌ టీ పౌడర్‌ పేరిట రీ ప్యాకింగ్‌ చేసి రోడ్డు పక్కన ఉండే టీ స్టాళ్లు, ఇతర దుకాణాల్లో విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ దందా చేస్తున్నారు. కల్తీకి సంబంధించి ఏమైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా హెచ్‌ ఫాస్ట్‌ నెంబర్‌ 87126 61212 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు.

పదిమంది నిందితుల అరెస్ట్‌

మూడు వేల కిలోలసరుకు స్వాధీనం

Advertisement
 
Advertisement
Advertisement