● ఐ అండ్ పీఆర్ కమిషనర్ను కలిసిన జర్నలిస్ట్ సంఘాల నేతలు
సాక్షి,సిటీబ్యూరో: ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలను పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా సీనియారిటీని విస్మరించి ఏకపక్షంగా ప్రకటించిన హైదరాబాద్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని తక్షణమే రద్దు చేసి పునర్వ్యవస్థీకరించకుంటే ఆందోళన తప్పదని పలు జర్నలిస్టు యూని యన్లు హెచ్చరించాయి. గురువారం ఐఆండ్ పీఆర్ కార్యాలయంలో కమిషనర్ ప్రియాంకను కలిసి హైదరాబాద్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటులో జరిగిన అవకతవకలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన పత్రికల సీనియర్ జర్నలిస్టులను సైతం విస్మరించి తమకు అనుకూలంగా వ్యవహరించేవారికి స్థానం కల్పించారని ఆరోపించారు. అడ్వర్టైజ్మెంట్ విభాగాల్లో పనిచేసే వారికి కూడా కమిటీలో ప్రాధాన్యత కల్పించడంపై అను మానం వ్యక్తం చేశారు. ఫొటో, వీడియో, ఉర్దూ, ఎలక్ట్రానిక్, చిన్న పత్రికల యూని యన్లు ప్రతిపాదించిన అర్హులైన జర్నలిస్టుల పేర్లను పరిగణనలోకి తీసుకోకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్య క్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజిద్, హెచ్ యూజే అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు.


