జీహెచ్ఎంసీ అధికారులపై హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: మహా నగర పరిధిలో అనధికారిక నిర్మాణాలపై జీహెచ్ఎంసీకి కుప్పలుగా ఫిర్యాదులొస్తున్నా.. పరిష్కారం అంతంత మాత్రంగానే ఉందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులతో సరిపెడుతోందని, అత్యంత స్వల్పంగానే ఉత్తర్వులు జారీ చేస్తోందని అభిప్రాయపడింది. ఇంత పెద్ద నగరంలో ఎక్కడా అనధికారిక నిర్మాణాలపై పూర్తి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఫిర్యాదులు, తీసుకున్న చర్యలను ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా వెబ్సైట్ వివరాలు అప్లోడ్ చేయాలని పేర్కొంది. కోఠిలో జ్ఞానశేఖర్ అనే వ్యక్తి అనధికారిక నిర్మాణం చేపట్టినా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాము అధికారులకు ఫిర్యాదు కూడా చేశామని స్పందన లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుకు ఇది నిదర్శమన్నారు. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేశారు.


