మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి
మేడ్చల్ రూరల్ : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 252 జీవోలో..అవసరమైన మేరకు సవరణలు చేసి డీపీఆర్ఓలకు పంపిస్తామన్నారు. గురువారం శామీర్పేట్లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ అధ్యక్షతన నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు జారీ చేసే అక్రెడిటేషన్ కార్డుల విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, గతంలో కంటే మెరుగైన జీవోను ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. జర్నలిజంతో సంబంధం లేని వారికి అక్రెడిటేషన్లు జారీ కాకుండా యూనియన్ బాధ్యులు జాగ్రత్త వహించాలని సూచించారు. కమిటీ సభ్యులకు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సంఘం సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ మాజీద్ పాల్గొన్నారు.


