రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలి మృతి

Aug 29 2023 2:58 AM | Updated on Aug 29 2023 6:24 AM

- - Sakshi

హిమాయత్‌నగర్‌: ప్రైవేట్‌ కాలేజీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రోడ్డుపై పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికురాలిని వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్ను మూసింది. నారాయణగూడ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

జనగామ జిల్లా, కళ్లెం గ్రామానికి చెందిన సునీత(42) జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–15లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఆమెకు భర్త గోవర్దన్‌, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త గోవర్దన్‌ గ్రామంలోనే వ్యవసాయం చేస్తుండగా సునీత సీతాఫల్‌మండీలో పిల్లలతో కలిసి ఉంటోంది. సోమవారం ఉదయం డ్యూటీకి వచ్చిన ఆమె బయోమెట్రిక్‌ అనంతరం రోడ్డు ఊడ్చే పనిలో నిమగ్నమైంది.

ఇదే సమయంలో మొయినాబాద్‌కు చెందిన ‘ఆయాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని రాంకోఠి నుంచి కింగ్‌కోఠి వైపు వెళుతుంది. నాంపల్లి, బజార్‌ఘాట్‌కు చెందిన డ్రైవర్‌ మహ్మద్‌ మోమిన్‌ అతి వేగంగా బస్సు నడుపుతూ పిస్తాహౌజ్‌ సమీపంలో రోడ్డు శుభ్రం చేస్తున్న సునీతను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమె తలకు, చేయి, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. తోటి కార్మికులు ఆమెను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. నారాయణగూడ పోలీసులు డ్రైవర్‌ మహ్మద్‌ మోమిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మేయర్‌ దిగ్భ్రాంతి
జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సునీత మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సునీత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామ ని హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్ధేశించిన ఆర్థిక సాయాన్ని తక్షణం అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరో పక్క యూనియన్‌ నాయకులు పోలీసుస్టేషన్‌కు చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థికపరమైన చేయూత అందించాలంటూ ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యాన్ని కోరారు.

విద్యార్థులకు గాయాలు
అతి వేగంగా వచ్చిన బస్సు సునీతను ఢీకొట్టిన అనంతరం చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న విద్యార్థులు ముందు సీట్లకు గుద్దుకోవడంతో గాయాలపాలయ్యారు. తన వల్ల ఓ నిండుప్రాణం బలైన విషయాన్ని కూ డా డ్రైవర్‌ మహ్మద్‌ మోమిన్‌ గుర్తించకపోగా ‘క్యాహువా’ అంటూ సంబోధించడాన్ని చూసిన తోటి పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. సునీత తల్లి కొన్నేళ్ల క్రితం మృతి చెంద డంతో ఆమె ఉద్యోగాన్ని సునీత చేస్తున్నట్లు తెలిసింది.

అతి వేగం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది. నారాయణగూడ ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ కాలేజీ బస్సు ఢీకొని జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందగా, బేగంపేటలో కారు ఢీ కొని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం చెందింది. వివరాలిలా ఉన్నాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement