హన్మకొండ/హన్మకొండ అర్బన్: ప్రైవేట్ ఆస్పత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నిబంధనలు పాటించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ ఎ.అప్పయ్య అన్నారు. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్, జిల్లా మేనేజర్ విక్రమ్, మున్సిపల్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి ఆయన శనివారం హనుమకొండలోని రోహిణి, ఏకశిల హాస్పిటల్ను తనిఖీ చేశారు. స్పెషలిస్ట్ డాక్టర్ల వివరాలు, సేవలకు తీసుకునే ఫీజుల వివరాలతో కూడిన ధరల పట్టిక, వివిధ ప్రభుత్వ అనుమతుల పత్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ డీఎంహెచ్ఓ కార్యాలయానికి వివిధ రిపోర్టులను సకాలంలో అందజేయాలన్నారు. ఫీజుల పట్టిక తగినం సైజులో ప్రదర్శించకపోవడంతో పాటు గుర్తించిన ఇతర లోపాలకు సంబంధించి రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తామని డాక్టర్ అప్పయ్య తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కన్సల్టేషన్ ఫీజులు, వైద్య సేవలకు తీసుకోవాల్సిన ధరల పట్టిక, డాక్టర్ల వివరాలను పేషెంట్లు, వారి సహాయకులు పరిశీలించాలన్నారు.
హనుమకొండ డీఎంహెచ్ఓ ఎ.అప్పయ్య
రోహిణి, ఏకశిల ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తామని వెల్లడి


