హన్మకొండ కల్చరల్: రాష్ట్ర సేవికా సమితికి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ‘ప్రణవ నాదం’ పేరుతో నిర్వహించిన సామూహిక ఘోష్ (వివిధ రకాల వాయిద్యాల) ప్రదర్శన ఆకట్టుకుంది. 90 మంది సేవికలు ఆనక్ (డ్రమ్), వంశీ, ఝల్లరి, శంఖం తదితర వాయిద్యాలతో భారతీయ సంప్రదాయ వేషధారణలో మహిళలు, యువతులు, బాలికలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తిరసంతో పాటు దేశభక్తి, జాతీయ భావనను చాటి చెప్పింది. మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, పెంపొందించడమే కార్యక్రమ ఉద్దేశమని రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ ప్రొద్దుటూరి రూప తెలిపారు. ధర్మ, సమాజ, సంస్కృతి పరిరక్షణలో మహిళల పాత్ర కీలకమన్నారు. ప్రాచీనయుద్ధ విద్యలు, వాద్యకళలు భారతీయ సంస్కృతిలో భాగమని, వాటిని భావితరాలకు అందించడమే తయ ధ్యేయమని పేర్కొన్నారు. సమయపాలన, క్రమశిక్షణ ప్రతిరోజు అందించే శిక్షణకు ఘోష్ ప్రదర్శన నిదర్శనమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువత, బాలికల్లో ధైర్యం, సన్మార్గం పెంపొందిస్తాయని తెలిపారు. ప్రదర్శన అనంతరం సేవికలు భారతమాతకు ప్రణామం చేస్తూ ప్రార్థన చేశారు. ధర్మరక్షణ, సమాజసేవ రెండు కళ్లుగా రాష్ట్ర సేవికా సమితి పనిచేస్తుందని రూప తెలిపారు. వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ఎస్. మాలతి, విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అసిస్టెంట్ లెక్చరల్ హరివిజయశ్రీ, వైద్యురాలు మంతెన శిరీష, రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత సంచాలిక డాక్టర్ మాగంటి అరుణ, శ్రీపాద రాధ, సముద్రాల కవిత, అర్చన, వాంకుడోత్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఘోష్ను ప్రదర్శిస్తున్న సేవికలు
ఆకట్టుకున్న ప్రణవనాదం
శ్రీభద్రకాళి దేవాలయంలో 90 మంది సేవికల ప్రదర్శన
క్రమశిక్షణ, దేశభక్తి, ఆధ్యాత్మికతల కలబోతగా కార్యక్రమం


